జ్వరం వస్తే ఎవ్వరైనా సరే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. జ్వరమనే కాదు ఆరోగ్యం బాగోకపోతే వైద్యులను కలవడం మామూలే. వాళ్లు ఇచ్చే సూదులు, మాత్రలతో తిరిగి కోలుకుంటారు. అయితే కొందరు మాత్రం అనారోగ్యంగా ఉంటే డాక్టర్లను కాకుండా మూఢ నమ్మకాలను ఆచరిస్తుంటారు. అప్పటికీ తక్కువ కాకపోతే ఆర్ఎంపీ డాక్టర్ను కలిసి వైద్యం చేయించుకుంటారు. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు పెద్దాసుపత్రికి వెళ్తారు. అప్పటివరకు కోడిగుడ్లు, నిమ్మకాయలు, మూడు బజార్ల వైద్యం అంటూ లేనిపోని నమ్మకాలతో కాలం వృథా చేస్తారు. ముఖ్యంగా గ్రామాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలా నమ్మేవాళ్లు ఉన్నంత కాలం మోసగించే వారికి కొదవ ఉండదని చెప్పొచ్చు. దెయ్యాలు, భూతాలు, మాయామంత్రాలు లేవని చెప్పాల్సిన ఓ డాక్టర్.. యంత్రాలు, తాయత్తులతో రోగాలు తగ్గుతాయని చెప్పి ప్రజల అమాయకత్వం, నమ్మకాలను సొమ్ము చేసుకుంటే ఎలా ఉంటుంది?
మందులు, చికిత్సతోనే జబ్బులు నయమవుతాయని రోగులకు ధైర్యం చెప్పాల్సిన డాక్టర్.. గవ్వలేసి మంత్రాలు చేస్తే ఎలా ఉంటుంది? మహబూబాబాద్లోని కొత్తగూడలో ఇలాంటి ఓ వింత డాక్టర్ ఉన్నాడు. ఆస్పత్రి బయట ఆర్ఎంపీ అనే బోర్డు తగిలించుకున్న ఈ వైద్యుడు.. తలుపులు మూసి లోపల గవ్వలేసి మంత్రగాడిలా అవతారం ఎత్తుతాడు. ఆర్ఎంపీ డాక్టర్గా కంటే భూతవైద్యంతోనే డబ్బులు బాగా వస్తుండటంతో అతడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆరోగ్యం బాగోలేక తన దగ్గరకు వచ్చే వారికి గవ్వలేసి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తున్నాడు. మీ ఇంట్లో ఫలానా సమస్య ఉందంటూ, తాయత్తు కట్టుకుంటే తగ్గుతుందని మాయమాటలు చెబుతున్నాడు. చుట్టుపక్కల నుంచి ఎంతోమంది ఆయన దగ్గరకు వస్తుండటం గమనార్హం. మరి, ఓ ఆర్ఎంపీ డాక్టర్ అయ్యుండి వైద్యం చేయకుండా తాయత్తులు, తావీజులు కడుతూ జనాలను మోసం చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.