మానవ చరిత్రను తెలుసుకోవడానికి పుస్తకాలు, శాసనాలు బాగా ఉపయోగపడతాయి. అదే మన వైభవం, ఆచార వ్యవహారాలు తెలుసుకునేందుకు మాత్రం శిల్ప సంపద లాంటివి ఉండాల్సిందే. అందుకే అరుదైన శిల్పాలు దొరికినప్పుడు వాటిని పరిశీలించి, చరిత్రను ముందు తరాలు తెలుసుకునేలా భద్రపరుస్తుంటారు. ఇలాంటి శిల్పాలను కనుగొనేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చేసే కృషి ప్రశంసనీయమనే చెప్పాలి. వాళ్ల కృషి వల్లే చరిత్రలో మరుగున పడిన ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి. ఇదిలాఉంటే.. తెలంగాణలోనే అతిపెద్ద ద్వారపాలకుడి శిల్పం తాజాగా బయటపడింది.
సిద్ధిపేట జిల్లా, నారాయణరావుపేట మండలం, మల్యాలలోని పొలాల్లో ఓ శిల్పం బయటపడింది. వెయ్యేళ్ల నాటి ఈ అపురూప ద్వారపాలకుడి శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు గుర్తించారు. ఈ ఫౌండేషన్ సభ్యులు అహోబిలం కరుణాకర్, మహ్మద్ నసీరుద్దీన్ ఇచ్చిన సమాచారంతో ప్లీచ్ ఇండియా సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఈ శిల్పాన్ని పరిశీలించారు. భూమి మీద 6 అడుగులు, భూమి లోపల 3 అడుగులు, 9 అంగుళాల మందంతో గ్రానైట్ రాతిలో చెక్కిన ఈ భారీ శిల్పం విష్ణుద్వార పాలకుడైన విజయునిదని ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
ఇలాంటి అరుదైన శిల్ప సంపదను కాపాడుకోవాలని శివనాగిరెడ్డి అన్నారు. శిల్పకళ, విగ్రహ లక్షణాన్ని బట్టి ఈ శిల్పం రాష్ట్రకూట అనంతర కల్యాణ చాళుక్య తొలి కాలం.. అంటే క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందినదని శివనాగిరెడ్డి వెల్లడించారు. ఇంతకుముందు ములుగు జిల్లా, గణపురంలో వెలుగుజూసిన 8 అడుగుల వైష్ణవ ద్వారపాలక శిల్పం కంటే ఈ శిల్పం పెద్దదని పేర్కొన్నారు. ఇలాంటి అరుదైన శిల్పాలను ఆదరించాలని, అదే తరుణంలో వీటిని తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.