ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా పోరాటం ముగిసింది. రెండో సెమీ ఫైనల్లో భారత్పై ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ భారత్ని కట్టడి చేయడంలో కాస్త తడబడినట్లు కనిపించింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా పడకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు జోస్ బట్లర్ 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. అలెక్స్ హేల్స్ 47 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 86 పరుగులు చేశాడు. వెరసి టీమిండియాకి ఘోర ఓటమి తప్పలేదు. ఫైనల్లో పాకిస్తాన్- ఇంగ్లాండ్ తలపడనున్నాయి. అసలు టీమిండియా ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటో చూద్దాం..
పవర్ ప్లే లో స్లో బ్యాటింగ్.. టీమిండియా ఈ సిరీస్ ప్రారంభం అయిన దగ్గరి నుంచి పవర్ ప్లేలో స్లో బ్యాటింగ్ చేస్తూనే ఉంది. మిగిలిన జట్లు పవర్ ప్లేలో 50, 60 పరుగులు చేస్తుంటే.. టీమిండియా 30 పరుగులు చేస్తే గగనం అన్నట్లు తయారైంది పరిస్థితి. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఫామ్లో లేకపోవడం, ఆ ప్రెజర్ తర్వాత బ్యాటర్లపై పడటం కూడా ఈ స్లో బ్యాటింగ్కి కారణంగా చెప్పవచ్చు. పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు చేయలేకపోవడం వల్లే భారత్ ప్రత్యర్థులకు మంచి లక్ష్యాలను ఇవ్వలేకపోయింది.
ఈ సిరీస్లో అద్భుతంగా రాణించిన వాళ్లు ఎవరైనా టీమిండియాలో ఉన్నారా అంటే అది.. సూర్య కుమార్ యాదవ్- విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు. ఇండియా గెలిచిన అన్ని మ్యాచుల్లో వీళ్లిద్దరి ప్రదర్శన ఆధారంగానే విజయాలు లభించాయి. ఓ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అవ్వగా హార్దిక్ పాండ్యా 40 పరుగులు చేశాడు. మళ్లీ సెమీస్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడు. మొదటి నుంచి విరాట్ కోహ్లీ టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూనే ఉన్నాడు. కానీ, సూర్య- విరాట్ కోహ్లీ మీదే టీమిండియా అతిగా ఆధారపడటం మొదటికే మోసం చేసింది.
టీమిండియా బ్యాటింగ్ గురించి అయినా అందరికీ కొంత ఆశ ఉందేమో గానీ.. బౌలింగ్పై ఎవరకీ ఎలాంటి ఆశ లేదు. టీమిండియా బౌలింగ్ డొల్లతనం ఈ సెమీస్లో బాగా బయటపడింది. రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాచ్ గెలవాలి అని అనుకున్న అభిమానులు చివరకు ఒక్క వికెట్ అయినా తీయండి అనే పరిస్థితికి వచ్చింది. ఓ ఒక్క బౌలర్ కూడా ఇంగ్లాండ్ ఓపెనర్లను కట్టడి చేయలేకపోయారు. 4 ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ని ముగించేసి ఇంగ్లాండ్ దర్జాగా ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఇప్పటికైనా బౌలింగ్ని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు టీమిండియా చేస్తుందేమో చూడాలి.
స్పిన్లో చాహల్కు చాలా మంచి రికార్డులు ఉన్నాయి. టోర్నమెంట్ ప్రారంభం నుంచి చాహల్ను కేవలం బెంచ్కే పరిమితం చేశారు. ప్రతి మ్యాచ్లో అశ్విన్కి అవకాశం ఇస్తూ వచ్చారు. ప్రతి మ్యాచ్లో అశ్విన్ ఎన్ని పరుగులు ఇచ్చాడో అందరూ చూశారు. అశ్విన్ బౌలింగ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఒక వేళ వికెట్ తీసినా పరుగులు మాత్రం తెగ ఇచ్చేశాడు. అశ్విన్ స్థానంలో ఒక్క మ్యాచ్లో అయినా చాహల్కు అవకాశం ఇచ్చిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్ మైనస్లలో చాహల్ ని తీసుకోకపోవడం కూడా ప్రధానమైన కారణంగా చెబుతున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ముందు రెండో సమీ ఫైనల్లో టీమిండియా ప్రదర్శనలో గెలవాలి అనే కసి ఎక్కడా కనిపించలేదు. ఏదో చిన్న జట్టులాగా రెండు బౌండరీలు పోగానే డీలా పడిపోయారు. కెప్టెన్ గా రోహిత్ కూడా వ్యూహాలు, ప్రణాళికలు వేసినట్లు ఎక్కడా కనిపించలేదు. బౌలర్లు వికెట్లు తీయలేకపోతుంటే రోహిత్ వెళ్లి వారితో మాట్లాడింది లేదు. అసలు టీమ్ మొత్తం గెలిచేందుకు ఆడారా? లేదా? అనే అనుమానం రాకమానదు. మొత్తానికి సెమీస్ నెగ్గి పాక్తో పారాడుతారని ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇప్పటికైనా టీమిండియా తప్పులను సరిదిద్దుకుని ముందుకెళ్తే బాగుంటుందంటూ అభిమానులు ఆశిస్తున్నారు.
#TeamIndia put up a fight but it was England who won the match.
We had a solid run till the semifinal & enjoyed a solid support from the fans.
Scorecard ▶️ https://t.co/5t1NQ2iUeJ #T20WorldCup | #INDvENG pic.twitter.com/5qPAiu8LcL
— BCCI (@BCCI) November 10, 2022