చెన్నై సూపర్ కింగ్స్కు ధోని తర్వాత అంతటి పెద్దదిక్కు ఎవరంటే జడేజా అనే సమాధానం వస్తుంది. అందుకే ఐపీఎల్ 2022 సీజన్కు ముందు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే.. ఆ బాధ్యతలను జడేజాకే అప్పగించింది టీమ్ మేనేజ్మెంట్. కెప్టెన్సీ అనుభవం లేక తీవ్ర ఒత్తిడికి గురైన జడేజా వ్యక్తిగతంగా కూడా విఫలమయ్యాడు. బౌలింగ్, బ్యాటింగ్తో పాటు చివరకు ఫీల్డింగ్లోనూ రాణించలేకపోయాడు. దాంతో జడేజా కెప్టెన్సీని తిరిగి ధోనికే ఇచ్చేశాడు. ఆ తర్వాత గాయం కారణంగా ఆ సీజన్లోని మిగతా మ్యాచ్లకు దూరమయ్యాడు.
అయితే ఉద్దేశపూర్వకంగా జడేజాను తప్పించారనే వార్తలు ఆ సమయంలో ప్రచారంలోకి వచ్చాయి. మహేంద్ర సింగ్ ధోనీతో పాటు టీమ్మేనేజ్మెంట్తో వచ్చిన విభేదాలలే జడేజాను జట్టుకు దూరం చేసాయనేది ఆ వార్తల సారంశం. జడేజా సైతం టీమ్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఈ వార్తలను ఖండించాడు. ఇవన్నీ గాలి వార్తలని స్పష్టం చేశాడు. జడేజా వచ్చే సీజన్లో కూడా సీఎస్కేకు ఆడుతాడని చెప్పాడు. దాంతో ఈ ప్రచారానికి బ్రేక్ పడింది.
ఇంగ్లండ్తో రీషెడ్యూల్ టెస్ట్తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన జడేజా సెంచరీతో సత్తా చాటాడు. శనివారం ఇంగ్లండ్తో జరగనున్న రెండో టీ20తో మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి సీఎస్కేకు సంబంధించిన పోస్టులన్నీ డిలీట్ చేశాడు. దీంతో అతను సీఎస్కే ఫ్రాంచైజ్ నుంచి పూర్తిగా బయటికి వచ్చేసినట్లు సమాచారం. సీఎస్కే గుడ్బై చెప్పిన జడేజా ఐపీఎల్ 2023లో కొత్త జట్టుకు ఆడనున్నట్లు తెలుస్తుంది. కాగా వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు వైస్ కెప్టెన్గా జడేజా ఎంపికైన విషయం తెలిసిందే. మరి ఐపీఎల్ 2023లో జడేజా ఏ జట్టు తరపున ఆడాతాడో తెలియాలంటే అప్పటివరకు వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.