వన్డే ప్రపంచ కప్ ప్రారంభానికి నిండా రెండు నెలలు కూడా లేని ఈ తరుణంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అనవసర ప్రయోగాలతో జట్టును భ్రష్టు పట్టిస్తున్నాడు.
విశ్వ సమరం కోసం ప్రతి జట్టు.. ప్లానింగ్ తో ముందుకు సాగుతుంది. నాలుగేళ్లకు ఒక సారి నిర్వహించే ఈ టోర్నీ కోసం ప్రపంచ దేశాలన్నీ సుదీర్ఘ కసరత్తు చేస్తాయి. మరి అలాంటిది.. పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎంత కష్టపడుతుందో అనుకుంటే పొరబడినట్లే. సరైన దిశానిర్దేశం లేని భారత జట్టు.. ఇంకా ప్రయోగాలతోనే టైమ్ వేస్ట్ చేస్తోంది. అక్టోబర్ 5న ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. రెండు నెలలు కూడా లేని సమయంలో ద్రవిడ్ పిచ్చి ప్రయోగాలతో జట్టులో అయోమయం నెలకొల్పుతున్నాడు. సాధారణంగా ప్రపంచకప్ జట్టంటే ముందుగానే నిర్ణయం తీసుకుంటారు. వాళ్లందరినీ కలిపి పలు మ్యాచ్ ల్లో ఆడించి.. ప్రతిభ, ప్రదర్శన ఆధారంగా ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలో నిర్ణయిస్తారు. కానీ ప్రస్తుతం టీమిండియాలో దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.
ప్రతి ఒక్కరు మెగాటోర్నీ జట్టులో చోటు దక్కించుకోవాలనే ఉద్దేశంతో తమను తాము నిరూపించుకోవాలని చూస్తున్నవాళ్లే తప్ప ఒక్కరు కూడా జట్టుగా కలిసి ఆడుదామనే ఆలోచనతో లేరనేది స్పష్టమవుతోంది. దీనికి ప్రధాన కారణం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అనక తప్పని పరిస్థితి. ఒకవైపు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దూకుడైన ఆటతో దంచికొడుతూ దూసుకెళ్తుంటే.. మనవాళ్లు మాత్రం ఇంకా జట్టులో స్థానం కోసం పాకులాడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం వెస్టిండీస్ తో మూడో వన్డే ఆడనున్న టీమిండియా.. ఆ తర్వాత ఆసియా కప్, ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ మాత్రమే ఆడనుంది. ఆసియా కప్ లో ఫైనల్ చేరితే 6 మ్యాచ్ లు ఆసీస్ తో 3 వన్డేలు విండీస్ తో ఒకటి.. మొత్తం కలిపి 10 మ్యాచ్ లు మాత్రమే ఆడనుంది. ఇలాంటి సమయంలో ప్లెయింగ్ ఎలెవన్ ను ముందే నిర్ణయించి.. వారికే తరచూ అవకాశాలివ్వాల్సింది పోయి.. ప్రయోగాల పేరుతో అసలుకే ఎసరు తెస్తున్న ఘనత మాత్రం ముమ్మాటికీ రాహుల్ ద్రవిడ్ దే.
2019 వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు కేవలం నాలుగో స్థానంలో తప్ప బ్యాటింగ్ ఆర్డర్ లో మిగిలిన అన్ని ప్లేస్ లకు నిర్దిశ్టమైన ఆటగాళ్లను ముందే నిర్ణయించారు. మంచి సన్నద్ధత కూడా లభించింది. ఫలితంగా మనవాళ్లు.. లీగ్ దశలో వరుస విజయాలతో సత్తాచాటారు. సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం పక్కన పెడితే.. సన్నాహకాల్లో మాత్రం లోటు కన్పించలేదు. కానీ ఈ సారి అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. 2011 తర్వాత తొలిసారి స్వదేశంలో ప్రపంచకప్ జరుగనుంది. అలాంటి సమయంలో నిర్దిశ్టమైన జట్టును ఎంచుకొని తరచూ వాళ్లనే తుది జట్టులో ఉంచి మ్యాచ్ లు ఆడిస్తే.. జట్టు సభ్యుల్లో సమిష్టి తత్వం పెరిగేది. ఎవరి బాధ్యత ఏంటి అనేది తెలిసొచ్చేది. కానీ అదే జరగడం లేదు. ద్వితీయ శ్రేణి జట్టు కన్నా బలహీనంగా ఉన్న విండీస్ పైనే మనవాళ్లు ప్రభావం చూపలేకపోతున్నారంటే.. తీవ్ర ఒత్తిడి ఉండే.. వన్డే వరల్డ్ కప్ లో ఇక మనకు రిక్తహస్తాలే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దిగ్గజ బ్యాటర్ గా.. సహనానికి నిలువుటద్దంగా.. టెక్నిక్ లో ఎవరెస్ట్ అంత ఎదిగిన భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్.. జాతీయ జట్టుకు దూరమైన తర్వాత కోచ్ అవతారమెత్తాడు. మొదట భారత అండర్-19, భారత్-ఏ జట్లకు కోచింగ్ ఇచ్చి అటునుంచి టీమిండియా బాధ్యతలు చేపట్టాడు. మరి శిక్షణలో సుదీర్ఘ అనుభవం ఉన్న ద్రవిడ్.. జట్టులోని ఆటగాళ్లలో ఒకరిపై ఒకరికి నమ్మకం పెంచాలనే అంశం ఎందుకు గుర్తు రావడం లేదో అనేది అర్థం కావడం లేదు. తుది 11 మంది తరచూ కలిసి ఆడితే ఎవరి లోపం ఏంటీ.. ఎవరు ఏ అంశంలో ఇంకా మెరుగవ్వాలి.. ఎవరి ఏ బాధ్యత ఇస్తే సరిగ్గా నిర్వర్తిస్తారు అనేది తేలేది కాదా.. ఇలా కాకుండా యువ ఆటగాళ్లందరినీ ప్రపంచకప్ జట్టులో చోటు అనే ద్రాక్ష పండు చూపించి ఊరిస్తుండటంతో వాళ్లంతా వ్యక్తిగతంగా సెంచరీలు చేయాలని చూస్తున్నారే తప్ప.. ఒక్కరూ నిలకడ కనబర్చలేకపోతున్నారు. 2007 వన్డే ప్రపంచకప్ లో భారత జట్టు ద్రవిడ్ సారథ్యంలోనే బరిలోకి దిగగా.. అప్పుడు ఇలాంటి తప్పుడు ప్రయోగాలతోనే టీమిండియా లీగ్ దశలోనే ఇంటి బాటపట్టింది. మరీ ఘోరంగా బంగ్లాదేశ్ చేతిలోనూ ఓడింది. మరి ఇప్పటికైనా తేరుకోకుంటే.. అలాంటి పరిణమాలే మరోసారి ఎదురు కాకతప్పదేమో.