2019 వన్డే వరల్డ్ కప్లో రాయుడిని ఎంపిక చేయని సంగతి తెలిసందే. ధావన్ గాయపడిన ఆ స్థానంలో రాయుడు ఎంపిక చేయకపోవడం అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో ఇటీవలే రాయుడు అప్పటి సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీద షాకింగ్ కామెంట్స్ చేసాడు. దీనికి తాజాగా ఎమ్మెస్కే మాట్లాడుతూ రాయుడుకి కౌంటర్ ఇచ్చాడు.
అంబటి రాయుడు రిటర్మెంట్ వ్యవహారం గురించి రోజుకొక చర్చ నడుస్తూనే ఉంది. ఏ విషయం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనబడడం లేదు. ఇక వివరాల్లోకెళ్తే.. 2019 వరల్డ్ కప్ కి ముందు రాయుడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తెలుగు క్రికెటర్ ఈ వరల్డ్ కప్ లో సెలెక్ట్ కావడం పక్కా అనుకున్నారు. తుది జట్టులో స్థానం దక్కకపోయినా కనీసం స్క్వాడ్ లో స్థానం దక్కుతుందని ఆశించారు. కానీ ఊహించినదేమి జరగలేదు. దీంతో తన దురదృష్టం అని సర్దుకుపోయిన రాయుడికి శిఖర్ ధావన్ గాయపడడంతో అదృష్టం వెతుకుంటూ వచ్చింది. టీంఇండియాలో ధావన్ ప్లేస్ లో రాయుడు రాక కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ధావన్ స్థానంలో త్రీడి ప్లేయర్ అని విజయ్ శంకర్ ని సెలెక్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
సెలెక్టర్లు తన మీద పక్షపాతం చూపించారనే ఉద్దేశ్యంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాయుడు అందరికీ షాకిస్తూ రిటైర్మెంట్ ప్రకటించాడు . దీంతో అప్పట్లో రాయుడికి అన్యాయం జరిగిందని అందరూ జాలి చూపించారు. ఇక ఈ విషయం అంతటితో ముగిసిపోగా ఇటీవలే రాయుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన 2019 వన్డే వరల్డ్ కప్లో తనను భారత జట్టుకు ఎంపిక చేయకపోవడం వెనుక ఎమ్మెస్కే ప్రసాద్ హస్తమున్నదని.. ఆయన కక్షగట్టి తనను వన్డే వరల్డ్ కప్ జట్టులోకి రాకుండా అడ్డుకున్నాడని రాయుడు వ్యాఖ్యలు చేసాడు. తాజాగా బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కౌంటర్ ఇచ్చాడు.
ఎమ్మెస్కే ప్రసాద్ టైమ్స్ నౌతో మాట్లాడుతూ.. “సెలక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారన్న సంగతి మనందరికీ తెలుసు. వీరితో పాటు కెప్టెన్ కూడా సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవుతాడు. ఇక్కడ ఏ ఒక్కరి నిర్ణయమో ఫైనల్ కాదు. సెలక్షన్ కమిటీలో తీసుకునే ప్రతీ నిర్ణయమూ ఎంతో జాగ్రత్తగా.. సమిష్టిగా తీసుకునేది. ఒకవేళ ఒక చీఫ్ సెలక్టర్ మాత్రమే తీసుకునే నిర్ణయమే అయితే ఇంతమంది అవసరం ఉండేది కాదు. అక్కడ తీసుకునేది ఏది కూడా వ్యక్తిగత నిర్ణయం కాదు. నేను ఏదైనా ప్రతిపాదించినా దానికి అందరి అంగీకరిస్తేనే మేము తీసుకునే నిర్ణయాలు ఓకే అవుతాయి. అంతేకాని ఒక్కరినే టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు ఉండదు. రాయుడు వన్డే వరల్డ్ కప్ కంటే ముందే ఇంటర్నేషనల్ లెవల్ లో కొన్ని మ్యాచ్ లు ఆడాడు. మరి అప్పుడు లేని విబేధాలు ఇప్పుడెందుకు వచ్చాయి. నేను ఒక్కటే విషయం క్లీయర్ గా చెప్పదలుచుకున్నా. సెలక్షన్ కమిటీలో తీసుకునే ఏ నిర్ణయమైనా కలెక్టివ్ గా తీసుకునేది” అని చెప్పుకొచ్చాడు.