గత కొంత కాలంగా BCCI గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే టీమిండియా మెగా టోర్నీలు అయిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లల్లో వైఫల్యాల కారణంగా బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. అదీకాక జట్టు సెలక్షన్ పై కూడా అంతా అసంతృప్తిగా ఉన్నారు. దాంతో సెలక్షన్ కమిటీని పూర్తిగా రద్దు చేశారు కూడా. మరో కమిటీ కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది బోర్డు. ఇన్ని సమస్యల మధ్య మరో సమస్య బీసీసీఐ నెత్తిన పిడుగులా పడింది. అదేంటంటే టీమిండియాకు ఇప్పటి వరకు ప్రధాన స్పాన్సర్ గా ఉన్న ప్రముఖ ఎడ్యూటెక్ సంస్థ అయిన ‘బైజూస్’ టీమిండియాతో తెగతెంపులకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గత నెలలోనే దీనికి సంబంధించి బోర్డుకు లేఖను రాసింది.
టీమిండియా ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తోన్న ‘బైజూస్’ సంస్థ.. ఆర్థిక, ఇతర కారణాలతో స్పాన్సర్ షిప్ ను కోనసాగించలేమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బుధవారం బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. చివరకు 2023 మార్చి వరకైనా స్పాన్సర్ షిప్ కొనసాగించాల్సిందిగా BCCI బైజూస్ ను కోరింది. ఉన్నట్టుండి స్పాన్సర్ షిప్ నుంచి వైదొలిగితే.. కిట్ పేరు, స్పాన్సర్ పేరు మార్పుల వల్ల అనేక సమస్యలు వస్తాయని బీసీసీఐ వెల్లడించింది. మరోవైపు కిట్ స్పాన్సర్ అయిన MPL స్పోర్ట్స్ కూడా కిట్ ఒప్పంద హక్కులను వేరే సంస్థకు బదలాయించాలని బోర్డును కోరింది. ఇంతే డబ్బులకు కేవల్ కిరణ్ క్లాతింగ్ లిమిటెండ్ (KKCL)కు కిట్ స్పాన్సర్ షిప్ హక్కులు ఇవ్వమని కోరింది. ఇదిలా ఉండగా జూన్ లోనే బైజూస్.. బీసీసీఐతో రూ. 290 కోట్లతో 2023 నవంబర్ వరకు ఈ స్పాన్సర్ షిప్ అమల్లో ఉండేలా ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.