కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14.. రెట్టించిన ఉత్సాహంతో సెకెండ్ హాఫ్గా రోబోతోంది. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ, ఒమన్ వేదికగా ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి జట్ల మధ్య సెకెండ్ హాఫ్ తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే దాదాపు అన్ని ఫ్లాంచైజీల ప్లేయర్లు యూఏఈ చేరుకున్నారు. మిగిలిన కొందరు ఆటగాళ్లు కూడా చేరుకుంటున్నారు. ఇంగ్లాండ్ నుంచి ఏకంగా ఛార్టర్ ఫ్లైట్లు వేసి మరీ ఆటగాళ్లను తీసుకొస్తున్నాయి ఫ్రాంచైజీలు. ఇదిలా ఉంటే కొందరు ప్లేయర్లు కరోనా కారణంగా, వ్యక్తిగత కారణాల రీత్యా లీగ్ నుంచి తప్పుకున్నారు. వారి స్థానంలో ఇప్పిటకే రీప్లేస్ ప్లేయర్లను కూడా ఎంచుకున్నాయి జట్లు.
తాజాగా ఇంగ్లాండ్ ప్లేయర్లు మూడు జట్లకు షాక్ ఇచ్చారు. జానీ బెయిర్స్టో, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్ తాజాగా తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వారి నిర్ణయంతో సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్ తగిలిందనే చెప్పాలి. అయితే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వారి నిర్ణయానికి సంబంధించి జట్లు స్పందించాల్సి ఉంది. మరి, వారిస్థానంలో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి.