పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం డీఎస్ ను సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లోని తన నివాసంలో అనారోగ్యానికి గురికావడంతో డీఎస్ ను బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యుకు చికిత్స అందిస్తున్నారు. డీఎస్ అనారోగ్యానికి సంబంధించిన కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. శ్రీనివాస్ అస్వస్థకు గురికావడంతో ఆయన తనయుడు, ఎంపీ ధర్మపురి అర్వింద్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హుటాహుటీన ఆస్పత్రికి వెళ్లారు.
ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పని చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేయడమే కాక అందరి వాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ గా డీఎస్ కలిసి జోడెద్దుల్లా పని చేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వారిద్దరు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ కు చావోరెవే గా మారిన 2004 ఎన్నికల సమయంలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో డి. శ్రీనివాస్ పాత్ర కీలకమనే చెప్పాలి. ఆ సమయంలో డీఎస్ పేరు సీఎం అభ్యర్థిగా కూడా ప్రచారం జరిగింది.
తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన వివిధ పరిణామాల కారణంగా కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ చేరారు. అక్కడ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే, కొంతకాలంగా డీఎస్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. సోమవారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో హుటాహుటీన సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. డీఎస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. డీఎస్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం తెలియాల్సి ఉంది.