మోత్కుపల్లి నరసింహులు.. తెలంగాణ రాజకీయ నాయకుల్లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నాడు. భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి అటు ఎమ్మెల్యే నుంచి ఇటు మంత్రి వరకూ తన మార్క్ రాజకీయంతో ప్రజల్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే గతంలో తెలుగుదేశం పార్టీలో మాస్ లీడర్ గా ఉన్న మోత్కుపల్లి మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన బీజేపీలోకి చేరారు. కొన్నాళ్ల పాటు ఆ పార్టీలో మెలిగిన మోత్కుపల్లి బీజేపీలో సముచిత స్థానాన్ని ఇవ్వడం లేదని, ప్రశ్నించే గళాన్ని నొక్కుతున్నారని బాహాటంగానే చెప్పుకొచ్చారు.
దీంతో పార్టీ నేతలు మోత్కుపల్లిని పరోక్షంగా విమర్శించటంతో ఇటీవల ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే దళితబంధు పథకంపై, కేసీఆర్ పై మోత్కుపల్లి మీడియా ముఖంగా ప్రశంసలు వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలం నుంచి మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఇక ఆయన చేరికకు ముహుర్తం కూడా ఖరారైందని, ఈ నెల 18న సోమవారం కేసీఆర్ సమక్షంలో కారు పార్టీలోకి వెళ్లనున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.