ఉప ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రికి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికను కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఎలాగైన ఈటెల దెబ్బకొట్టేందుకు అంది వచ్చిన అవకాశాలన్ని వాడుకుంటున్నారు సీఎం కెసిఆర్. ఇక ఈ నేపథ్యంలోనే దళిత బంధు అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. హుజూరాబాద్ లో దళిత, బీసీ సామజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండటంతో ఈ పథకానికి అంకురార్పణ జరిగిందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.
ఇక ఈ పథకాన్ని రాష్ట్రమంత అమలు చేసేందుకు మొదటగా పైలెట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ లో అమలు చేస్తున్నామని ప్రభుత్వం వర్గం నేతలు పెదవి విప్పుతున్నారు. ఇక దళిత బంధుతో ఓట్లను రాబట్టుకునేందుకు ఇదొక మార్గంగా ప్రభుత్వం భవిస్తుందని ప్రతి పక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే బుధవారం ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభిరెడ్డి దళిత బంధు పథకంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు దళిత బంధు పథకాన్ని అమలు కాకుండా ఆదేశాలు ఇవ్వాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇది కాకుండా ఈ పథకాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని భావిస్తే గనుక హుజురాబాద్ లో కాకుండా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా అమలు చేయాలని లేఖలో సూచించారు. ఇక ఈ పథకం ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పద్మనాభి రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్నికల కోడ్ అమల్లో లేకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని తెలిపారు.