విదేశాలకు వెళ్లి మంచి చదువులు చదివి, కుటుంబానికి అండగా నిలవాలని నేటి యువత భావిస్తున్నారు . ఆ ఆశలను నెరవేర్చుకునేందుకు ఖండాంతరాలు దాటి పరాయి దేశాలకు వెళుతున్నారు. అక్కడ అష్ట కష్టాలు పడ్డా.. తల్లిదండ్రులకు చెప్పకుండా మేనేజ్ చేసుకుంటున్నారు
విదేశాల్లో ఉన్నత చదువులు చదివి కుటుంబానికి అండగా నిలవాలని నేటి యువత భావిస్తున్నారు. ఆ ఆశలను, ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఖండాంతరాలు దాటి పరాయి దేశాలకు వెళుతున్నారు. అక్కడ అష్ట కష్టాలు పడ్డా.. తల్లిదండ్రులకు చెప్పకుండా మేనేజ్ చేసుకుంటున్నారు. ఎంఎస్ చేస్తూ అక్కడ ఖర్చుల కోసం పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉంటారు. విద్య, ఉద్యోగం కోసం నానా తంటాలు పడి అమెరికా వంటి దేశాలకు వెళుతున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉంటారు. అయితే అక్కడ పరిస్థితులు ఊహించని విధంగా తారుమారు అవుతుంటాయి. అదే జరిగింది తెలంగాణ మహిళ విషయంలో. మాస్టర్స్ చేద్దామని వెళ్లిన మహిళ దీన పరిస్థితికి చేరింది.
అమెరికాలో ఎంఎస్ చేద్దామని వెళ్లిన తెలంగాణ మహిళ.. షికాగో రోడ్డపై దయనీయ స్థితిలో కనిపించింది. ఆకలితో అలమటిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న తల్లి.. తన కుమార్తెను స్వదేశానికి తీసుకురావాలని కేంద్రాన్ని వేడుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని మౌలాలికి చెందిన సయ్యాదా లులు మిన్హాజ్ జైదీ 2021లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లింది. అక్కడ వెళ్లాక అమ్మతో ఫోన్లో తరచూ మాట్లాడుతుండేది. అయితే రెండు నెలలుగా జైదీ ఫోన్ చేయడం మానేయడంతో తల్లితో ఆందోళన ఎక్కువైంది. అయితే హైదరాబాద్ కు చెందిన కొంత మంది ఆమెను గుర్తించి.. ఆ విషయం తల్లికి తెలిపారు.
జైదీ పరిస్థితిని చూసి వీడియో తీసి తల్లికి పంపారు. అందులో ఆమె చాలా దయనీయ స్థితిలో కనిపించింది. తన వస్తువులు ఎవరో దొంగిలించడంతో రోడ్డుపై పడ్డట్లు తెలిపింది. ఆకలితో అలమటిస్తోందని పేర్కొంది. మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన తల్లి.. తిరిగి తన కుమార్తెకు స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్కు లేఖ రాశారు. ఈ లేఖను బీఆర్ఎస్ నేత ఖలీకర్ రెహమాన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
అమెరికాలో ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ మహిళ..! pic.twitter.com/RHnw1JbiN8
— Rajasekhar (@Rajasek61450452) July 26, 2023