విశాఖపట్నం- కరోనా మానవాళిని పట్టి పీడిస్తోంది. కరోనాకు నిర్ధిష్టమైన ఔషదం లేకపోవడంతో ఉన్న మందులతో నయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీకీ తీసుకుందామంటే అందరికి అందే సరికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రత్యమ్నాయ మార్గాల పై దృష్టి సారించారు అంతా. ఈ క్రమంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఆయుర్వేద ఔషధం. కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు బాగా పనిచేస్తుందనే ప్రచారంతో అందరి దృష్టి ఆయుర్వేదంపై పడింది. ఆస్పత్రి పాలైన కరోనా రోగులు సైతం ఆనందయ్య మందు తీసుకున్నాక ఆరోగ్యవంతులయ్యారని చెప్పడంతో అంతా కృష్ణపట్నానికి పరుగులు తీశారు. ఆ తరువాత ఆనందయ్య మందు వివాదంలో పడటం, కొన్నాళ్లు మందు తయారీ ఆగిపోవడంతో కరోనా రోగులంతా నిరాశ చెందారు.
కానీ ఇప్పుడు మళ్లీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వడంతో కరోనా రోగుల్లో ఆశలి చిగురించాయి. ఇటివంటి సమయంలో కరోనా రోగానికి మరో హోమియో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఈ మందుతో కరోనా వారం రోజుల్లో నయం అవుతుందని చెబుతుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ హోమియో మందుపై పడింది. కరోనా మహమ్మారికి తాను మందు కనుక్కొన్నానని విశాఖపట్నం కు చెందిన హోమియో వైద్యుడు అప్పారావు చెబుతున్నారు. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో అందరి ఆరోగ్యం కోసం ఔషధం యొక్క ఫార్ములాను బహిరంగంగా విడుదల చేశానని ఆయన చెప్పారు. ఈ మందు అన్ని హోమియో మందుల షాపులలో దొరుకుతుందని అప్పారావు తెలిపారు. ఒక్క కరోనా రోగి చికిత్సకు కేవలం 300 రూపాయల లోపే ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు.
తన దగ్గరకు వచ్చిన చాలా మంది కరోనా రోగులకు మందు ఇచ్చానని, వారికి వారం లోపే కరోనా తగ్గిందని చెప్పారు హోమియో వైద్యులు అప్పారావు. ఈ హోమియో ఔషధం వాడితే బ్లాక్ ఫంగస్ కూడా రాదని ఆయన చెబుతున్నారు. కొంత మంది కరోనా రోగులు అప్పా రావు మందు వాడితే, తమకు కరోనా తగ్గిందని చెబుతున్నారు. దీంతో కరోనా రోగులంతా అప్పారావు చెప్పిన ఔషధంపై ఆసక్తి చూపుతున్నారు. మరి ఏ మేరకు ఈ కరోనా హోమియో మందు పనిచేస్తుందన్నది ముందు ముందు తేలాల్సి ఉంది.