తెలంగాణలోని దళిత కుటుంబాల అభివృద్ది, దళితులు ఆర్థిక సాధికారత సాధించాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన పథకం ‘దళిత బంధు’. ఈ పథకాన్ని తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇపట్టికే శాలపల్లిలో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గానికే రూ.2 వేల కోట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పథకానికి రూ.500 కోట్లు విడుదలచేశారు. తాజాగా మరో రూ.500 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం.
ఇక, వారం రోజుల్లో ప్రభుత్వం మరో రూ. వెయ్యి కోట్లు విడుదల చేయనుంది. ఈ పథకాన్ని తొలుత హుజురాబాద్లో, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు. మొదట ఈ పథకం కొందరికే అని ప్రచారం జరగటంతో.. ఈ పథకం అందరికీ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత బంధు పథకం ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు కూడా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. రైతు బంధు తరహాలో మొదట పేద, మధ్యతరగతి వారితో ప్రారంభించిన దళితులు అందరికీ దళిత బంధు అందుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మరోవైపు దళిత బంధు పథకంపై ప్రతిపక్షాలు కారాలు, మిరియాలు నూరుతున్నాయి. దళితలపై అంత ప్రేముంటే ముందు వారికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులకు రూ.10 లక్షలు చొప్పున ఇవ్వాలంటూ డబ్బులు ఎక్కడి నుంచి తేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దళిత బంధు ‘ఓట్ల బంధు’ మాత్రమే అని ఎద్దేవా చేస్తున్నాయి. కేవలం హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళిత బంధు తీసుకొచ్చారంటూ వ్యాఖ్యానిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఈ విషయమై గతంలో ఓసారి కేసీఆర్ ఆయన స్టైల్లో క్లారిటీ ఇచ్చారు. ‘తెరాస సన్నాసుల మఠం కాదు కదా. ఎన్నికల్లో గెలవాలని మాకు ఉండదా?’. ఏమీ చేయనివాళ్లే అధికారం కావాలంటున్నారు. ఇంత చేస్తున్న మేము కోరుకోమా’? అంటూ కేసీఆర్ చురకలు వేశారు.