హైదరాబాద్- తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబందించి కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీల విషయంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీలు చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. భార్యా భర్తలను ఒకే చోటుకు బదిలీ చేసేందుకు వచ్చిన వినతులు, అభ్యంతరాలనూ వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జోనల్ విధానంలో భాగంగా తెలంగాణలో దాదాపు 70 వేల మందికి పైగా ఉద్యోగుల బదలాయింపు జరిగింది. ఈ క్రమంలో భార్యా భర్తలైన పలువురు ఉద్యోగులు బదిలీలను కోరారు. పనిచేస్తున్న చోటు కాకుండా వేరే జిల్లాలు, జోన్లు, మల్లీ జోన్లకు వెళ్లిన ఉద్యోగులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం వీరందరికి అప్పీళ్లకు అవకాశం కల్పించడంతో సుమారు మూడు వేల మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో సహేతుకమని భావించిన వాటినే అధికారులు పరిష్కరించి మిగిలిన అభ్యర్ధనలను తిరస్కరించారు. భార్యా భర్తల బదిలీలకు సంబంధించి కొన్ని జిల్లాలకు మాత్రమే అనుమతించారు. రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో పట్టణ, నగర ప్రాంతాల్లోని పోస్టులకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఉద్యోగులు ఆవేధన వ్యక్తం చేశారు.
దీంతో టీఎన్జీవో నేతలు బుధవారం సీఎస్ సోమేశ్ను కలిసి, బదలాయింపులపై వచ్చిన అప్పీళ్లను పరిష్కరించాలని, పరస్పర బదిలీలు వెంటనే చేపట్టాలని, ఒకే చోటుకు దంపతుల బదిలీలకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాల వినతులను సీఎస్ సోమేశ్ కుమార్ బుధవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్కు నివేదించారు. వెంటనే స్పందించి ముఖ్యమంత్రి పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.