సూర్యాపేట- అక్కడ చితిపై శవం కాలుతోంది. ఆ శవం సగం కాలాక హఠాత్తుగా పోలీసులు ఎటంర్ అయ్యారు. హడావుడిగా చితి మంటలను ఆర్పేసి, సగం కాలిన శవాన్ని ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఏంజరుగుతుందో తెలియక ఆయోమయంలో పడ్డారు.
ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. మందుకు బానిసైన కొడుకును భరించలేక తండ్రి అతడిపై ఆవేశంగా దాడి చేశారు. కొడుకు అమాంతం కిందపడిపోయి చనిపోవడంతో ఏం చేయాలో ఆతండ్రికి అర్ధం కాలేదు. సైలెంట్ గా అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించాడు. గుట్టుచప్పుడు కాకుండా శ్మశానంలో కొడుకు శవం తగలబెడుతుండగా, గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు.
చితిపై శవం కాలిపోతుండగా వచ్చిన పోలీసులు మంటలు ఆర్పేసి, సగం కాలిన శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు. గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన 32 ఏళ్ల నాగరాజు భార్య ఐదేళ్ల క్రితం చనిపోయింది. దీంతో నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తుండేవాడు. రోజూ తాగొచ్చి గొడవ చేస్తుండడంతో ఆగ్రహం చెందిన తండ్రి రామయ్య కొడుకుపై గొడ్డలితో దాడి చేశాడు. తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలపాలై నాగరాజు అక్కడికక్కడే చనిపోయాడు.
ఆవేశంలో గొడ్డలితో కొట్టడంతో కొడుకు చనిపోగా, ఏం చేయాలో పాలుపోని తండ్రి ఎవరికి అనుమానం రాకుండా శవాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించాడు. హుజూర్ నగర్ రోడ్డులో కొడుకు శవాన్ని దహనం చేస్తుండగా, గమనించిన గ్రామస్తులు వెంటనే విషయం గ్రామ వీఆర్వోకు చెప్పారు. వీఆర్వో పోలీసులకు సమాచారం అందించడంతో, నాగరాజు శవం దహనం చేస్తుండగా వచ్చిన పోలీసులు చితిపై కాలిపోతున్న శవాన్ని మంటలు ఆర్పివేసి పోస్టుమార్టానికి తరలించారు.