హైదరాబాద్- తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఎంతో మంది విన్నపాలు చేస్తుంటారు. తమకు ప్రభుత్వం నుంచి సాయం కావాలని కొందరు, లేదంటే వ్యక్తిగతంగా హెల్ప్ చేయాలని మరి కొందరు కేటీఆర్ కు విజ్ఞప్తులు చేస్తుంటారు. కానీ ఓ రైతు మంత్రి కేటీఆర్ కు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. తాను ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రైతు లెటర్ రాయడం చర్చనీయాంశమవుతోంది.
అవును నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు మంత్రి కేటీఆర్కు లేఖ రాశాడు. ప్రస్తుతం ఈ లెటర్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కనగల్ మండలంలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన చొప్పరి శ్రీను అనే రైతు శుక్రవారం మంత్రి కేటీఆర్కు, జిల్లా కలెక్టర్ కు ఓ లేఖ రాశాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నానని, అయితే పల్లె ప్రకృతి వనానికి తన భూమి తీసుకున్నారని లేఖలో ఆ రైతు వాపోయాడు.
అంతకు ముందు కొంత భూమిని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కోసం తీసుకున్నారని వివరించాడు. ఇంజనీరింగ్ చదివిన తనకు ఎలాంటి ఉద్యోగమూ లేకపోవడంతో వ్యవసాయమే జీవనాధారంగా చేసుకొని బతుకు సాగిస్తున్నట్లు శ్రీను లేఖలో పేర్కొన్నాడు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్కు, ఎమ్మెల్యేకు, కనగల్ తహసీల్దార్కు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని చెప్పుకొచ్చాడు.
తనకు మిగిలిన భూమిని కూడా పల్లె ప్రకృతి వనానికి తీసుకోవడంతో తాను ఇప్పుడు రోడ్డున పడ్డానని, జీవితం దుర్భరంగా మారిందని, అందువల్ల తాను ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని శ్రీను మంత్రి కేటీఆర్ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది.