ఇప్పుడు దేశాన్ని కరోనా కమ్మేసింది. అని వర్గాల ప్రజలు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో వైద్య రంగం విఫలం కావడంతో ఈ కరోనా కష్టాలు మరింత పెరిగిపోయాయి. నిజానికి కరోనా ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి మధ్య సుమారు 6 నెలల గ్యాప్ వచ్చింది. ప్రభుత్వం కనుక కాస్త ముందు చూపుతో ఆలోచించి, వైద్య రంగాన్ని పటిష్టం చేసుకుని ఉండుంటే ఇన్ని మరణాలైతే సంభవించేవి కాదు. కానీ.., ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. కరోనా మొదటి వేవ్ లో వైరస్ వ్యాప్తి మన దేశంలో నెమ్మదిగానే సాగింది. ప్రాణాపాయం కూడా కాస్త తక్కువగానే ఉండింది. కానీ.., సెకండ్ వేవ్ లో పరిస్థితి మారిపోయింది. వైరస్ శరీరంలోకి కి ప్రవేశించిన తక్కువ సమయంలోనే మిగతా అవయవాలకు వైరస్ వ్యాప్తి జరిగిపోతుంది. ఇందువల్లే ఇంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. సెకండ్ వేవ్ లో వైరస్ గురించి అందరికి ఇంత వరకే తెలుసు. కానీ.., తాజాగా జరిగిన అధ్యాయనాలు కారణముగా శాస్త్రవేత్తలు కొన్ని సంచలన నిజాలను బయటపెట్టారు. సెకండ్ వేవ్ కొనసాగుతోన్న కొద్దీ.., కరోనా సోకుతున్న మహిళలు శాతం పెరుగుతూ పోతోంది. దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులను అధ్యయనం చేస్తే ఈ గణాంకాలు నిజమని అర్ధం అవుతాయి. కరోనా ఫస్ట్ వేవ్ లో 34 శాతం మహిళలు కరోనా భారిన పడ్డారు. కానీ.., ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మొదలైన ఈ కొద్ది రోజులకే ఈ లెక్క 38.5 శాతానికి పెరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు వీరిలో ప్రమాద స్థాయి కూడా పెరిగినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గతంలో హాస్పిటల్స్ లో చేరిన మహిళల అడ్మిషన్ల శాతం 33 గా ఉండగా ఇప్పుడు అది 39 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ మొదలుకుని మహిళల కరోనా కేసులు పెరగడం కాస్త ఆందోళనకి గురి చేస్తున్న విషయం. నిజానికి పురుషులతో పోల్చుకుంటే మహిళలు ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కరోనా నుండి కోలుకోవడం కష్టం అవుతోంది. కాబట్టి మహిళలు ముందుకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.