ప్రతిష్టాత్మక రామోజీ గ్రూపు సంస్థల మాజీ ఎండీ, రామోజీ రావు బాల్య స్నేహితుడు అట్లూరి రామ్మోహన్రావు (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. అట్లూరి రామ్మోహన్రావు 1935లో కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించారు. రామోజీరావుతో కలిసి ఈయన విద్య అభ్యసించారు. అప్పటి నుంచే రామ్మోహన్ రావుకు రామోజీరావుతో సాన్నిహిత్యం ఉన్నది. అయితే, రామోజీ రావు వ్యాపారంలోకి వెళ్లగా.. రామ్మోహన్ రావు ఉపాధ్యాయుడిగా మారారు.
అనంతరం ఉపాధ్యాయ వృత్తిని వదులుకున్న రామ్మోహన్రావు 1975లో ఈనాడులో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఈ క్రమంలో 1978లో ఈనాడు డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన, 1982లో ఈనాడు ఎండీగా పదోన్నతి పొంది.. 1995 వరకు ఆ పదవిలో కొనసాగారు. అంతేకాదు.. 1992 నుంచే ఫిల్మ్ సిటీ నిర్మాణ వ్యవహారాల్లో చురుగ్గా పాలు పంచుకున్న ఆయన, 1995లో ఫిల్మ్ సిటీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. రామోజీ గ్రూప్, ఈనాడు సంస్థల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. రామ్మోహన్రావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.