ఫిల్మ్ డెస్క్- రాధే శ్యామ్.. యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న తాజా సినిమా. బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కు రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా రాధే శ్యామ్ నిర్మించాయి. సంక్రాతి పండగ సందర్బంగా జనవరి 14న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.
ఈ క్రమంలో చిత్ర బృందం రాధే శ్యామ్ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, మోషన్ పిక్సర్స్, పాటలు, గ్లిమ్స్, ట్రైలర్ అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రాధే శ్యామ్ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో ఈనెల 23న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్సిటీలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నారు. అందు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారని, దేశ వ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారని, రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుకకోసం వివిధ రాష్ట్రాల నుంచి ప్రభాస్ అభిమానులు వస్తున్నారని నిర్మాతలు చెప్పారు. ప్రభాస్ అభిమానులే అతిథులుగా రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుక జరగబోతోందని తెలిపారు. ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకూ మంచి స్పందన వస్తోందని రాధే శ్యామ్ నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.
జస్టిన్ ప్రభాకరన్ అందించిన మ్యూజిక్ కు మంచి స్పందన వస్తోందని చెప్పారు. రాధే శ్యామ్ మూవీకి హిందీలో మిథున్, అనూ మాలిక్, పవన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఓ పాన్ ఇండియా సినిమాకు వేర్వేరు భాషలకు వేర్వేరు సంగీత దర్శకులు పనిచేయడం ఇదే మొట్టమొదటి సారి అని మేకర్స్ తెలిపారు. జనవరి 14న రాధే శ్యామ్ విడుదలవుతున్న నేపధ్యంలో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.