హైదరాబాద్- దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో చాలా వరకు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలను సడలించేశారు. తెలంగాణ రాష్ట్రంలోను లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేశారు. కరోనా దాదాపు నియంత్రణలోకి వచ్చిన నేపధ్యంలో జులై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. విధ్యార్ధుల ఇష్టం మేరకు నేరుగా క్లాసులకు హాజరు కావచ్చని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈనెల 25 నుంచే ప్రభుత్వ పాఠశాలల టీచర్లు విధులకు హాజరు కావాలని ఆదేశించింది.
ఇతవరకు బాగానే ఉన్నా ప్రత్యక్ష్య క్లాసులపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాకపోవడం, ధర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉండవచ్చన్న హెచ్చరికల నేపధ్యంలో విద్యా సంస్థల ప్రారంభానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోర్టు తెలంగాణ ప్రభుత్నాన్ని ప్రశ్నించింది. ఈ నేపధ్యంలో కేసీఆర్ సర్కార్ ప్రత్యక్ష్య తరగతులపై పునరాలోచించింది. జులై 1 నుంచి ఆన్లైన్ లోనే పాఠశాలల తరగతులు జరుగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రరెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని ముఖ్యమంత్రి అన్నారు.
ఇక 50 శాతం ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు. వెంటనే ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ ఆదేశించారు. మరో వైపు సీఎం కేసీఆర్ను పీఆర్టీయూ, టీఎస్ నాయకులు కలిశారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా దృష్ట్యా పాఠశాలల పున:ప్రారంభించాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వేయిదా వేయాలని, ఆన్ లైన్లోనే విద్యా బోధన కొనసాగించాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.