స్పెషల్ డెస్క్- మీకు ఆనందయ్య గుర్తున్నారు కదా.. అదేనండీ కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఆయుర్వేద మందు తయారు చేశారు కదా.. ఆ ఆనందయ్య. కరోనా టైంలో నెల్లూరు కృష్టపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ చేసి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు ఆనందయ్య. అప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచితంగా కరోనా మందును పంపిణీ చేశారు కూడా. ఆనందయ్య మందు కోసం తెలుగు వారే కాకుండా చుట్టు పక్కల రాష్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కానీ ఆ తరువాత ఏంజరిగిందో తెలియదు కాని ఆనందయ్య కొంత చల్లబడిపోయారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తనకు సహకారం అందడం లేదని మాత్రం అప్పట్లో వాపోయారు ఆనందయ్య. సరే ఇప్పుడు కరోనా తగ్గింది కదా.. మళ్లీ ఆనందయ్య గురించి ఎందుకు అని అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటంటే ఆనందయ్య రాజకీయాల్లోకి వస్తున్నారు. అవును మీరు విన్నది అక్షరాల నిజయం
అన్నట్లు ఆనందయ్య రాజకీయాల్లోకి రావడం కాదు.. ఏకంగా రాజకీయ పార్టీనే పెట్టబోతున్నారు. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలని కృష్ణపట్నం ఆనందయ్య నిర్ణయం తీసుకున్నారు. అన్ని కులాలను కలుపుకుని పార్టీ పెట్టాలని ఆనందయ్య భావిస్తున్నారట. ఇందులో భాగంగానే వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో ఆనందయ్య రాష్ట్రవ్యాప్తంగా రధయాత్ర చేయబోతున్నారని సమాచారం.
ఐతే ఆనందయ్య తన సొంతంగా పార్టీ పెట్టడం లేదని తెలుస్తోంది. జాతీయ నేతల అండదండలతో ఆయన రాజకీయ పార్టీ పెడుతున్నారనే చర్చ జరుగుతోంది. తనతో కలిసి వచ్చే బలహీన వర్గాలను కలుపుకుని వెళ్లాలని ఆనందయ్య కసరత్తు చేస్తున్నారట. మరి నెల్లూరు కరోనా ఆయుర్వేద మందు ఆనందయ్య రాజకీయ పార్టీ ఎలా ఉండబోతోంది, ఏంత మేర సక్సెస్ అవుతుందన్నది ముందు ముందు తేలనుంది.