ఓ సామాన్యుడు చేసిన పని జిల్లా కలెక్టర్ హృదయాన్ని కదిలించింది. అతడు చేసిన పనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఊరికోసం తను పడ్డ శ్రమ, చేసిన కృషి ఆదర్శనీయం. ఆ మారుమూల గ్రామానికి కలెక్టర్ కదిలొచ్చింది.
దేశానికి, పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలని చాలా మంది నిరంతరం కృషి చేస్తుంటారు. సివిల్స్ సాధించి ఐఏఎస్ గా ఎంపికై దేశ సేవ చేసేందుకు సంకల్పించుకుంటారు. కానీ వ్యవస్థలో ఉన్న లోపాలతో అనుకున్న స్థాయిలో పేద ప్రజలకు సాయపడలేక నిరుత్సాహ పడతారు. ఇదే విధంగా ఒడిశాలోని కాంధమాల్ జిల్లాకు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ బృంద ఐఏఎస్ ఈ వ్యవస్థకు ఏం చేయాలేక పోతున్నానని బాధపడింది. ఓ సామాన్యుడు తన ఊరు కోసం సొంతంగా రోడ్డు నిర్మించగా ఆ విషయం తెలిసి కలెక్టర్ గా నేనేమీ చేయాలేకపోతున్నానని సిగ్గుపడింది. ఆ తరువాత ఆమె తీసుకున్న చొరవ ఆమెపై అభినందనలు కురిసేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే..
దేశంలోని ఒడిశా రాష్ట్రం పేదరికంలో మగ్గుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. అక్కడ అంతులేని పేదరికం, గ్రామాలకు రోడ్లు, మంచి నీటి సరఫరా, విద్యా, వైద్యం ఏమీ అందవు. అసలు మౌళిక సదుపాయాల ఊసే ఉండదు. కాగా కాంధమాల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బృంద ఓ రోజు వార్తా పత్రికలు చదువుతున్న వేళ ఓ వార్త ఆమె హృదాయాన్ని హత్తుకుంది. దానికి సంబంధించిన వివరాలను అధికారులతో తెప్పించుకుని ఓ కలెక్టర్ గా సిగ్గుపడింది. తన డ్రైవర్ ను పిలిచి గుమ్సాహి అనే విలేజ్ కు వెళ్లాలని చెప్పి బయల్దేరింది. ఆ ఊరుకు చేరుకుని ఇక్కడ జలంధర్ నాయక్ ఎవరని అక్కడి స్థానికులను వివరాలు అడిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
సొంతంగా రోడ్డు నిర్మించిన జలంధర్
పుల్బనీ తాలూకాలోని గుమ్సాహి విలేజ్ కు చెందిన జలంధర్ నాయక్ సాహసోపేతమైన, ఆదర్శవంతమైన పని చేశారు. తన ఊరుకి రోడ్డు, కరెంటు లేవు, మంచినీటి సరఫరా అసలే లేదు. ఉపాధి లేక గ్రామస్థులు వలసలు పోతున్నారు. ఆ సమయంలో జలంధర్ నాయక్ తన ఊరుకు సొంతంగా రోడ్డు నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఆ ఊరు పిల్లలు స్కూల్ కు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులను ఆశ్రయించినా ఫలితం లేదు. చేతులు తడపందే పనులు చేయని అధికారులు తాము ఏమీ చేయలేమని చేతులెత్తేసారు. చేతకానీ ప్రభుత్వాలు నాయకుల వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదన్న ఆలోచనకు వచ్చిన జలంధర్ నాయక్.. కనీసం తన ఊరుకు రోడ్డు నిర్మించుకోలేన అని ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా పలుగు పార పట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డు వేయడం ప్రారంభించాడు. మొత్తం 15 కిలోమీటర్లు రోడ్డు వేయాలని నిర్ణయించుకున్నాడు. రాళ్లు రప్పలను తొలగిస్తూ రోడ్డు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తనకు అండగా ఒక్కరు కూడా ముందుకు రాలేదు.
కలెక్టర్ భావోద్వేగం
అయినా సరే నిరుత్సాహపడకుండా అలుపనేదే లేకుండా రెండేళ్లు కష్టపడి 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాడు. ఓరోజు స్థానిక వార్తా పత్రికకు చెందిన రిపోర్టర్ ఆ స్టోరీని రాశాడు. ఆ వార్తా కాంధమాల్ జిల్లా కలెక్టర్ కు చేరింది. అది చదివిన ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. ఈ వ్యవస్థలో భాగమైనందుకు సిగ్గుపడింది. అందుకే గుమ్సాహి విలేజ్ కు పయనమైంది. జలంధర్ నాయక్ ను కలిసింది. అతడితో మాట్లాడుతుండగా మేడమ్ మూడేళ్లు ఆగండి నేను ఆ రోడ్డును పూర్తి చేస్తాను అని జలంధర్ అన్నాడు. ఆ రోడ్డు చూసేందుకు వెళ్లి అతడు పడ్డ శ్రమను, సంకల్పాన్ని చూసి ముగ్దురాలైంది. అతడు చేసిన పనికి కొనియాడుతూ.. మిగతా ఏడు కిలోమీటర్లు నేను నిర్మిస్తానని కలెక్టర్ చెప్పింది. వెంటనే నిధులను సర్దుబాటు చేసి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. రోడ్డుపూర్తయ్యే వరకు జలంధర్ ను పర్యవేక్షకుడిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు చేసిన పనికి ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి కలెక్టర్ అంగీకరించింది. దీంతో పాటు ఆ విలేజ్ కు కరెంట్, మంచి నీటి సౌకర్యం కూడా ఏర్పాటు కాబోతోంది. ఊరికోసం నిలబడ్డ జలంధర్ నాయక్, ఓ సామాన్యుడి కష్టాన్ని గుర్తించి అండగా నిలిచిన కలెక్టర్ డాక్టర్ బృందపై ప్రశంసల వర్షం కురుస్తోంది.