మరణం.. శాశ్వతమైనది. ప్రతీ వ్యక్తి ఏదో ఒకరోజు మరణించక తప్పదు. అలా మరణించాక అంత్యక్రియలు నిర్వహించడమూ సహజమే. ప్రస్తుత కాలంలో అంత్యక్రియలకు చాలా డబ్బులు ఖర్చు కావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అంత్యక్రియలకు డబ్బులేక శవాలను లోయలో పడేసిన సంఘటన తెలిసిందే. అలా తనకు జరగకూడదనే 20 ఏళ్ల క్రీతమే తన సమాధిని తానే నిర్మించుకున్నాడో వ్యక్తి. ఆ వ్యక్తికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోతే వారి గుర్తుగా కొంత మంది సమాధులు కట్టిస్తూ ఉంటారు. మరికొంత మంది అనాథాశ్రమాలు కట్టి సమాజ సేవ చేస్తూంటారు. ఇవన్నీ ఒకరకమైతే ఇప్పుడు చెప్పబోయే వార్త మరో రకమైంది. తన మరణం కుటుంబ సభ్యులకు భారం కాకూడదని గ్రహించి.. తన అంత్యక్రియలకు డబ్బు దాచుకోవడమే కాకుండా సమాధిని సైతం నిర్మించుకున్నాడు పుట్టా నన్ జప్ప.
కర్ణాటకలోని చామరాజనగర్ తాలుకా నంజదేవనపుర గ్రామంలో పుట్ట మల్లప్ప అనే 85 ఏళ్ల వృద్ధుడు నివసిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులను కొన్నేళ్ల కిందటే అంచానా వేసిన ఈ పెద్దాయన రెండు దశాబ్దాల కిందట కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను చనిపోయాక ఎవరి మీద ఆధారపడవద్దని, తన అంత్యక్రియలు సొంత డబ్బులతోనే జరగాలని భావించాడు. దీంతో 20 ఏళ్ల కిందట సొంత డబ్బులు పెట్టి తన సమాధి తానే నిర్మించుకున్నాడు. సమాధి ఏర్పాటు చేసుకోవడంతో పాటు దాదాపు లక్ష రూపాయల నగదును అంత్యక్రియల కోసం దాచిపెట్టాడు.
ఈక్రమంలో పుట్ట మల్లప్ప అనారోగ్యానికి గురైయ్యాడు. వయసు పైబడింది.. ఆపై అనారోగ్యం దీంతో ఆదివారం అతను కన్నుమూశాడు. తండ్రి కోరిక మేరకే అతను నిర్మించుకున్న సమాధి వద్దే అంత్యక్రియలు నిర్వహించామని, అలాగే నాన్నదాచిన డబ్బునే వినియోగించామని కొడుకు నగేష్ వివరించారు. ఆత్మభిమానం గల ఈ పెద్దమనిషి తీసుకున్న నిర్ణయం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.