కుటుంబ సభ్యులు ఎవరైన మనకు దూరం అయితే ఆ బాధ ఎంత ఉంతగా ఉంటోందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారికి 11 రోజుల పాటు శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక మనం ఎంతగానో ఇష్టపడే సాదు జంతువులు చనిపోతే సంతాపం తెలపడం.. అంత్యక్రియలు జరపడం కూడా చూశాం. సాధారణంగా చాలా మందికి పక్షులు అంటే ప్రేమ ఉండడం సహజం. మూగ జీవాల్లో పక్షులకు ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కడైన ఓ పక్షి చనిపోతే వాటిని పట్టించుకొనే వారే ఉండరు. అయితే ఓ పిచ్చుక కోసం ఊరంతా కదిలింది. మనుషుల్లా దానికీ అంత్యక్రియలు నిర్వహించారు. దశదిన కర్మ జరిపించి.. శాస్త్రోక్తంగా పూజలు చేసి, సమాధి నిర్మించారు. అనంతరం అందరికీ భోజనాలు పెట్టారు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా శిద్లగట్ట మండలం బసవనపట్టణ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
చిక్కబళ్లాపుర జిల్లా శిద్లగట్ట మండలం బసవనపట్టణ గ్రామంలో చాలా పిచ్చుకలు ఉంటాయి. అయితే.. ఒకటి మాత్రం ఎంతో ప్రత్యేకం. ఎప్పుడూ అది ఊరి ముఖద్వారం వద్ద ఉండేది. ఏదైనా పనిపై ఊరు దాటేవారంతా దానిని చూసి వెళ్లేవారు. పని అయిపోయి తిరిగొచ్చేటప్పుడు మళ్లీ దానిని ఓసారి చూసి.. ఇళ్లకు చేరేవారు. దీంతో ఆ పిచ్చుకపై గ్రామస్థులు ఎనలేని మమకారం పెంచుకున్నారు. గత నెల 26న ఆ పిచ్చుక అకస్మాత్తుగా మరణించింది. అది చూసి గ్రామస్థులు తట్టుకోలేకపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఊరంతా కలిసి ఓ పిచ్చుకకు దశదిన కర్మ జరిపించి, భోజనాలు పెట్టారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఘనంగా అంత్యక్రియలు చేశారు. ‘తిరిగి రా’ అంటూ శ్రద్ధాంజలి పోస్టర్లు వేయించారు. భారీ మొత్తంలో వంటలు చేయించారు. చుట్టుపక్కల వారందరినీ పిలిపించి భోజనాలు పెట్టారు. పిచ్చుకకు సమాధి కూడా కట్టారు. పక్షుల్ని సంరక్షించాలని వచ్చినవారందరినీ కోరారు. ఊరిలో అందరూ కలిసి ఫోటోలు, వీడియోలు తయారు చేశారు. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.