అలహాబాద్- అమ్మ దగ్గర ఉంటావా.. పెళ్లాం దగ్గర ఉంటావా అని ఓ మైనర్ బాలుడిని కోర్టు అడిగితే.. ఏ మాత్రం తడుముకోకుండా అమ్మ వద్దు, పెళ్లామే కావాలని చెప్పాడు. మైనర్ బాలుడు అంటున్నారు మరి పెళ్లేంటీ.. పెళ్లామేంటని ఆశ్చర్యపోతున్నారా.. ఐతే అసలు సంగతి ఏంటంటే.. ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ కోర్టు ముందుకు ఓ విచిత్రమైన కేసు విచారణకు వచ్చింది. 16 ఏళ్ల మైనర్ బాలుడు, 21 ఏళ్ల యువతితో సహజీవనం చేశాడు. ఇద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాం అని చెబుతున్నారు. ఐతే అది తప్పు తమ దగ్గరకు వచ్చేయాలని ఆ బాలుడిని తల్లి దండ్రులు ఎంత బతిమాలినా ససేమిరా అన్నాడు. తాను ఆ యువతితోనే ఉంటాానని భీష్మించుకు కూర్చున్నాడు.
దీంతో తప్పని సరి పరిస్థితుల్లో తన కొడుకును తనకు ఇప్పించాలని ఆ మైనర్ బాలుడి తల్లి కోర్టును ఆశ్రయించింది. దీంతో అలహాబాద్ కోర్టు ఈ కేసును విచారించింది. ఇక విచారణ సందర్బంగా ఆ యువతిని, మైనర్ బాలుడిని న్యాయమూర్తి పలు ప్రశ్నలు వేశారు. ఇందులో భాగంగా నీవు తల్లి దగ్గర ఉంటావా, లేక ఆ యువతి దగ్గర ఉంటావా అని జడ్జి ఆ బాలుడిని అడిగారు. వెంటనే ఆ బాలుడు తనకు తల్లి వద్దు, తన పెళ్లామే కావాలని సమాధానం చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. మైనర్ వివాహం చెల్లదని న్యాయమూర్తి చెప్పడంతో.. అదంతా నాకు తెలియదు.. నాకు మాత్రం ఆమె పెళ్లామే, నాకు ఆమె కావాలని మొహమాటం లేకుండా చెప్పేశాడు.
దీంతో ఏంచేయాలో జడ్జ్ కే పాలుపోలేదట. మైనర్, మేజర్ సహజీవనం చేయడం చట్ట రిత్యా నేరం కాబట్టి, ఆ బాలుడికి మైనార్టీ తీరే వరకు ప్రభుత్వం ఆదీనంలో ఉన్న షెల్టర్ హోంకు తరలించాలని న్యాయమూర్తి జస్టిస్ జేజే మునీర్ ఆదేశించారు. 2022 ఫిభ్రవరి 4 తో ఆ బాలుడి మైనార్టీ తీరాక అతని ఇష్టప్రకారం ఆ యువతితో ఉండవచ్చని తీర్పునిచ్చారు. దీంతో ఆ బాలుడి తల్లి కన్నీళ్లు పెట్టుకుని కోర్టు నుంచి వెళ్లిపోయింది. ఆ బాలుడు మాత్రం తనకు మైనార్టీ తీరడానికి ఇంకా ఎన్ని రోులుందని లెక్కలు వేసుకుంటూ షెల్టర్ హోంకు వెళ్లిపోయాడు. అన్నట్లు ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ మైనర్ బాలుడికి, మేజర్ యువతికి ఇప్పటికే ఓ బాబు పుట్టాడట. అదన్నమాట సంగతి.