హైదరాబాద్- మరో నాలుగు రోజుల్లో నూతన సంవత్సరం 2022 లోకి ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారను బదిలీ చేసింది కేసీఆర్ సర్కార్. తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం రాత్రి ప్రభుత్వం జారీ చేసింది.
తెలంగాణలో మొత్తం 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్లుల్లో పేర్కొంది. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా సీవీ ఆనంద్ ను నియమించింది ప్రభుత్వం. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్ సీపీగా ఉన్న అంజనీకుమార్ ను ఏసీబీ డీజీగా నియమించారు. హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమీషనర్ గా ఏఅర్ శ్రీనివాస్ బదిలీ చేసింది తెలంగాణ సర్కార్.
ఇక ఏసీబీ డైరెక్టర్గా శిఖా గోయల్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా రంగనాథ్, నల్గొండ ఎస్పీగా రామ రాజేశ్వరి, సిద్దిపేట్ సీపీగా శ్వేత, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్, మెదక్ ఎస్పీగా రోహిణిప్రియదర్శిని, సైబరాబాద్ డీసీపీగా కల్మేశ్వర్, సైబరాబాద్ జాయింట్ సీపీగా అవినాష్ మహంతిని నియమించింది ప్రభుత్వం.
అటు హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా చందనా దీప్తి, హైదరాబాద్ సీసీఎస్ డీసీపీగా గజరావు భూపాల్, హైదరాబాద్ ఎస్బీఐ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, వికారాబాద్ ఎస్పీగా కోటిరెడ్డి, నిజామాబాద్ సీపీగా నాగరాజు, అదిలాబాద్ ఎస్పీగా ఉదయ్ కుమార్రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరో వారం రోజుల్లో మరి కొంత మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని తెలుస్తోంది.