మంచిర్యాల- ఈ రోజుల్లో కొన్ని వివాహ బంధాలకు బీటలు వారుతున్నాయి. జీవితం చివరి వరకు కలిసి ఉంటామని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్యా, భర్తల్లో కొందరు పెడదోవ పడుతున్నారు. భర్తను కాదని భార్య, లేదంటే భార్యను కాదని భర్త మరొకరితో సంబధం పెట్టుకుని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల పరువు పోవడంతో పాటు, కొన్ని సందార్బాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
మరికొందరి వైవాహిక బంధాల్లో భాగస్వామిని అర్థం చేసుకోకుండా అనుమానించే వారి వల్ల కూడా జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇదిగో ఇక్కడ ఓ భర్త, తన భార్య మరొకరితో చనువుగా ఉంటోందని అనుమానించి ఆమెను వేధింపులకు గురిచేశాడు. భర్త వేధింపులను భరించలేకపోయిన ఆ భార్య అతన్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంకేముంది మనస్థాపం చెందిన సదరు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషాదకరమైన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వేమనపల్లి మండలంలోని కాటేపల్లికి చెందిన సతీష్కు కుమురం భీం జిల్లా పెంచికల్పేటకు చెందిన యువతితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. వివాహమైన తరువాత వాళ్లు మంచిర్యాలలో కాపురం ఉంటున్నారు. ప్రస్తుతం వారికి రెండేళ్ల పాప ఉంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా భార్యకు ఆమెకు వరసకు బావ అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని సతీష్ అనుమానిస్తూ వస్తున్నాడు.
ఈ విషయంపైనే చాలా సార్లు భార్యతో సతీష్ గొడవపడడంతో పెద్దలు పంచాయితీ పెట్టి సర్దిచెబుతూ వస్తున్నారు. అయినప్పటికీ సతీష్ వేధింపులు ఆపకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలని కోరినా ఆమె పట్టించుకోకపోవడంతో సతీష్ తీవ్ర మనస్థాపం చెండాదు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.