ఫిల్మ్ డెస్క్- సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 8న తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ నగర్ వైకుంఠదామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
ఐతే మహేష్ బాబుకి కరోనా పాజిటివ్ కావడంతో, అన్నయ్య రమేష్ బాబు చివరి చూపుకు కూడా ఆయన రాలేకపోయారు. అన్నయ్య చివరి చూపుకునోచుకోకపోవడంతో మహేష్ బాబుతో పాటు ఆయన కుటుంబాన్ని, అభిమానులని ఎంతగానో కలచివేసింది. ఐతే ఇప్పుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న మహేష్ బాబు, శనివారం జరిగిన తన అన్నయ్య పెద్దకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా అన్నయ్యను చివరి చూపు చూడలేకపోయానని మహేష్ బాబు కన్నీటి పర్యంతం అయినట్లు సమాచారం. అన్నయ్య రమేష్ బాబు అంటే ముందు నుంచి మహేష్ బాబుకు ఎంతో ఆప్యాయత. ఈ విషయాన్ని పలు సందర్బాల్లో స్వయంగా మహేష్ బాబు చెప్పారు. అన్నయ్య రమేష్ బాబు చనిపోయిన రోజు మహేష్ బాబు ఎమోషనల్ అవుతూ చేసిన ట్వీట్ సైతం ఆయన ప్రేమను తెలియజేసింది.
మరో జన్మంటూ ఉంటే మీరే ఎప్పటికీ నా అన్నయ్య… మిమ్మల్ని ఇప్పుడు, ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను.. అంటూ మహేష్ ట్విట్టర్ లో ఎమోషనల్ గా చెప్పారు. రమేష్ బాబు ఇంట్లో జరిగిన ఈ పెద్దకర్మ కార్యక్రమానికి ఘట్టమనేని కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.