మందుబాబులు పీకలదాకా తాగి వైన్ షాప్ ల దగ్గరే పడిపోతుంటారు. అలా తూలుతూ వాహనం నడపడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్య కోసం ఇప్పటికే కొన్ని బార్లు క్యాబ్ సర్వీసులని అందిస్తున్నాయి. స్వయంగా ఇంటికి తీసుకెళ్లి దింపుతారు. అయితే ఇందుకు మందుబాబులు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మందుబాబులను ఉచితంగా ఇంటికి తీసుకెళ్లేలా ఒక సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.
ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తున్నా కూడా చాలా మంది తాగడం తగ్గించడంలేదు. తాగి ఊగుతూ ట్రాఫిక్ పోలీసులపైనే కోపగించుకోవడం చూస్తుంటాం. మనోళ్లు మద్యం తాగితే ఆగేదే లేదు. ఊగేదే.. మద్యం సేవించిన తర్వాత బండ్లు తీసి మైకంలో డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురవుతున్నారు. చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటువంటి సమస్యను పరిష్కరించుటకు బార్ల యాజమాన్యం క్యాబ్ సర్వీసులను ఏర్పాటుచేసింది. ఇంతకుముందు క్యాబ్లో స్వయంగా దింపినా కూడా మందుబాబుల జేబులకు చిల్లులు పడేవి. కానీ ఇకపై అలా కాకుండా క్యాబ్లకు మనీ పే చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఓ మార్గం కనిపెట్టింది. క్యాబ్ సేవలను పూర్తిగా ఉచితంగా మందుబాబులకు అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మద్యం ప్రియులకు సర్కార్ సూపర్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలు నెలకొంటున్న కారణంగా వాటిని తగ్గించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. నైట్ క్లబ్ల వద్ద అతిగా మద్యం సేవించే వారి కోసం ఉచిత టాక్సీ రైడ్లను అందిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద సెప్టెంబర్ నెల మధ్య వరకు దేశ వ్యాప్తంగా పుగ్లియా, టుస్కానీ, వెనెటో నుంచి ఆరు నైట్ క్లబ్లలో ఈ పథకాన్ని ప్రయోగించనున్నారు. ఇందులో నైట్ క్లబ్ వద్ద డ్రింకర్స్ వెళ్లేటప్పుడు వారికి టెస్టులు చేస్తారు. వారు లిమిట్కి మించి ఎక్కువగా మద్యం సేవిస్తే వారిని ఇంటికి తీసుకెళ్లడానికి టాక్సీని పిలుస్తారు. ఇంటివరకు మందుబాబులను దించే ఏర్పాటు చేశారు.
ఈ పథకాన్ని ఇటలీ రవాణా మంత్రి, ఉప ప్రధాన మంత్రి, హార్డ్-రైట్ లీగ్ పార్టీ నాయకుడు మాటియో సాల్విని ప్రకటించారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో ‘అతిగా తాగిన వారికి రాత్రి చివరిలో టాక్సీలు ఉచితం’ అని రాశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఇది ఒక ఆచరణాత్మక చొరవ అన్నారు. రోడ్డు ప్రమాదాలను ఆపడానికి జరిమానాలు, చట్టాలు సరిపోవని, ప్రతి ఒక్కరి ప్రాణాలను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవింగ్ సమస్య ఇటలీలో యూరోపియన్ ట్రాన్స్ పోర్ట్ సేఫ్టీ కౌన్సిల్ (ETSC) 2020 నివేదిక ప్రకారం తీవ్రంగా పెరిగింది. సర్వేలు కూడా ఇతర దేశాలతో పోలిస్తే ఇటలీలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువగా ఉందని తేల్చాయి. ఈ సందర్భంగా ఓ యువకుడు మీడియాతో మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు ఇది మంచి ఆలోచన అన్నారు. ఇక్కడి ప్రజలు డ్యాన్సులు చేస్తూ బయటికి వెళ్లి తాగుతారని, ఈ ప్లాన్ అమలు చేసిన మొదటి రోజు రాత్రి 21 మందిని టాక్సీల ద్వారా తీసుకెళ్లారని అన్నారు. ప్రభుత్వం ఈ విధంగా తమ గురించి ఆలోచించినందుకు ఆనందంగా ఉందన్నారు. మద్యం ఎక్కువగా సేవించి మీడియాతో గొడవ జరుగుతోందని తెలిపారు. ఎక్కువగా తాగిన వారికి టాక్సీలు సురక్షితంగా ఇంటికి చేర్చడానికి ఉపయోగపడతాయి అన్నారు.