హైదరాబాదులోని ఇందిరా పార్క్ అందరికీ తెలిసే ఉంటుంది. దోమలగూడ ప్రాంతంలో ఉండే ఈ పార్క్ నిత్యం సందర్శకుల తాకిడితో కళకళలాడుతూ ఉంటుంది. అన్నీ వర్గాల ప్రజలు ఇందిరా పార్క్ వద్ద సరదాగా కాస్త సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు. అయితే.., ఇలాంటి ఇందిరా పార్క్ వద్ద తాజాగా ఓ వివాదాస్పద బ్యానర్ దర్శనం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద “పెళ్లి కాని జంటలకు పార్కులోకి ప్రవేశం లేదు. ఇట్లు… పార్క్ మేనేజ్ మెంట్ అని స్పష్టం చేసున్న ఓ బ్యానర్ కలిపించింది. పబ్లిక్ అందరికీ ప్రవేశం ఉండాల్సిన పార్క్ ముందు ఇలాంటి బ్యానర్ దర్శనం ఇవ్వడంతో దీనిపై తీవ్ర దుమారం రేగింది. ఇక సోషల్ మీడియాలో అయితే.., ఈ బ్యానర్ కట్టిన పార్క్ నిర్వాహకులను ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్స్. వీరిపై అనేక మీమ్స్ కూడా క్రియేట్ చేసి, ట్రెండ్ చేశారు.
మీరా సంఘమిత్ర అనే సామాజికవేత్త ఈ బ్యానర్ పిక్ ని ఏకంగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి ట్యాగ్ చేశారు. “పార్కులో ప్రవేశానికి పెళ్లిని అర్హతగా ఎలా నిర్దేశిస్తారు? పబ్లిక్ పార్క్ అంటే అందరికీ ప్రవేశం ఉంటుంది. ఈ రూల్ రాజ్యాంగ విరుద్ధమైన చర్య” అని మీరా సంఘమిత్ర స్పష్టం చేశారు. దీంతో.., గంటల వ్యవధిలోనే పార్క్ అధికారులు దిగొచ్చారు. జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే ఇందిరా పార్క్ వద్ద ఆ బ్యానర్ ను తొలగించారు. కానీ.., అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరి.., ఇందిరా పార్క్ వద్ద అధికారులు ఇలాంటి బ్యానర్ ఎందుకు పెట్టుంటారు? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.