గుంటూరు- కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు.. దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఆనందయ్య ఆయుర్వేద ఔషధం కరోనా కు బాగా పనిచేస్తుందని, ఐసీయూలో ఉన్న కరోనా రోగులు కూడా ఆనందయ్య మందు తీసుకోగానే లేచి కూర్చుంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇంకేముంది కరోనా రోగులంతా ఆనందయ్య మందు కోసం ఎగడబడటం, ఆ తరువాత అది కాస్త వివాదం కావడం, అటు నుంచి ఆనందయ్య కనిపించకుండా పోవడం చకచకా జరిగిపోయాయి. ఇక ఆనందయ్య ఆయుర్వేద మందు మంచిదని కొందరు, కాదని మరి కొందరు వాదించడం మొదలుపెట్టారు. దీంతో ఆనందయ్య కరోనా మందుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబందించిన సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి.
ఇటువంటి సమయంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి కలకలం రేపుతోంది. కరోనా సోకిన కోటయ్య పది రోజుల క్రితం కృష్ణ పట్నం వెళ్లి ఆనందయ్య మందు తీసుకున్నారు. అచేతన స్థితిలో ఉన్న కోటయ్యను ఆనందయ్య దగ్గరకు తీసుకెళ్లగా.. ఆ మందు వేయగానే దిగ్గున లేచి కూర్చున్నారు. ఆనందయ్య మందు తీసుకున్న అనంతరం ఆక్సిజన్ లెవల్స్ పెరగడంతో కుదుటపడ్డారు కోటయ్య. దీంతో ఆనందయ్య కరోనా మందు భలే బాగా పనిచేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఐతే ఆ తరువాత మళ్లీ కోటయ్యకు ఆనారోగ్యం చేయడంతో ఆస్పత్రిలో చేరిపించి చికిత్స అందించారు. రెండు రోజుల తరువాత కోలుకున్న కోటయ్య ఇంటికి వెళ్లారు. అనంతరం ఆయన ఆరోగ్యం మళ్లీ విష మించడంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ కోటయ్య తుదిశ్వాస విడిచారు. దీంతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఆనందయ్య కరోనా మందుతో బతికి బట్టకట్టారనుకున్న కోటయ్య చనిపోవడంతో మళ్లీ ఆనందయ్య ఔషదంపై ఆనుమానాలు రేకెత్తుతున్నాయి. త్వరలోనే ఆనందయ్య మందు తయారు చేసి ఇస్తారన్న ఆశతో ఉన్న కరోనా రోగులందరికి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మరి ఆనందయ్య ఔషధంపై ముందు ముందు ఏంజరగబోతోందన్నదే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.