ఫిల్మ్ డెస్క్- ప్రముఖ సినీ పీఆర్వో, నిర్మాత బీఏ రాజు ఇక లేరు. ఆయన శుక్రవారం కన్నుమూశారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న బీఏ రాజుకు గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు శివకుమార్ తెలిపారు. బీఏ రాజు తెలుగులో సుమారు 1500 సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు. ఆయన భార్య బి.జయ పలు సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయన భార్య జయ 2018లో కన్నుమూశారు. బీఏ రాజు పీఆర్వోగా ఉంటూనే సూపర్హిట్ అనే సినీ వార పత్రికను నడిపారు. బీఏ రాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు హఠాన్మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
బీఏ రాజు మరణం పట్ల హీరో మహేష్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతను చనిపోయారంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. బీఏ రాజు తన చిన్నప్పటి నుంచి తెలుసని, ఆయనతో కలిసి చాలా కాలం పనిచేశానని మహేశ్ బాబు గుర్తు చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీ ఓ మంచి వ్యక్తిని కోల్పోయిందన్న మహేష్, బీఏ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. తన కుమారులు ఇటువంటి సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పారు. మహేష్ బాబు ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన ప్రభాస్, ఐ మిస్ యూ సర్ అని అన్నారు. ఇక తెలుగు, తమిళ సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు నిర్మాత బీఏ రాజు మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి ప్రగాడ సానూభూతి తెలిపారు.