ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా హుజూరాబాద్ ఉప ఎన్నికలపైనే చర్చలు నడుస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఇప్పుడు ఇదే తెలంగాణలో ప్రధాన పార్టీల ప్రతిష్టాత్మకంగా మారింది. హుజురాబాద్ ఉపఎన్నిక రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్స్ వంటిది అని అంటున్నారు.
అయితే తెలంగాణలో అధికార పార్టీపై ప్రజలకు పూర్తిగా విరక్తి కలిగిందని.. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి పైకి మాత్రం ప్రజా సంక్షేమాన్ని పటిష్టంగా అమలు పరుస్తున్నామని అంటున్నారని ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఈ ఎన్నికలో ఓడిపోతే టీఆర్ఎస్ పరువు పోతుందని, అందుకే ఎన్ని కుట్రలు చేసైనా హుజురాబాద్లో గెలవాలని ప్రయత్నిస్తోంద ఈటెల అన్నారు. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని.. అధికార పార్టీ విర్రవీగుతుందని.. ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. బీజేపీ ఊదితే టీఆర్ఎస్ ఔట్ అయిపోతుందని వ్యాఖ్యానించారు.
బెదిరిస్తే అమ్ముడుపోయేది లేదని.. బరిగీసి కొట్లాడుడే అని అన్నారు. నమ్మిన సిద్ధాంతానికి పులిబిడ్డల్లా కొట్లాడే బీజేపీ నేతలు, కార్యకర్తలు తన వెంట ఉన్నారని కేసీఆర్ గుర్తుపట్టుకుంటే మంచిదన్నారు. ఇప్పటికే హుజురాబాద్లో రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసిన టీఆర్ఎస్.. కనిపించిన వారందరికి పార్టీ కండువాలు కప్పుతూ రాజకీయాలను అపహాస్యం చేస్తోదన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు అన్ని సౌకర్యాలు అందుతున్నాయంటే తన వల్లేనని, ఆ అభిమానంతోనే ప్రజలు తనను గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.