హైదరాబాద్- తెలంగాణలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 20 నుంచి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఆంక్షలను ఉపసంహరించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈమేరకు ప్రగతి భవన్ లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత నెల 12 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. రెండు విడతలుగా లాక్ డౌన్ ను సడలించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈనెల 20 నుంచి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి అన్ని రకాల లాక్ డౌన్ ఆంక్షలను తొలగించాలని పలు ప్రభుత్వ శాఖలకు క్యాబినెట్ ఆదేశాలు జారీ చేసింది.
ఐతే లాక్ డౌన్ ను ఎత్తివేసినా ప్రజలు మాత్రం కరోనా ఆంక్షలను పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ ఎత్తేశారని ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదని, బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, సానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సీఎం సూచించారు. ఇక తెలంగాణలో విధ్యా సంస్థలను పున ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి స్కళ్లను, కళాశాలలను ప్రారంభించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. జులై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులను క్యాబినెట్ ఆదేశించింది. పూర్తిస్థాయి సన్నద్థతతో విద్యాసంస్థలను పున ప్రారంభించాలని స్ఫష్టం చేసింది.
జులై 1 నుంచి విధ్యా సంస్థలు ప్రారంభం అవనుండటంతో ఇకపై ఆఫ్ లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చని మంత్రి వర్గం స్పష్టం చేసింది. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల తరగతులకు విధ్యార్ధులు హాజరు కావచ్చని తెలిపింది. ఐతే కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం విధ్యాశాఖను ఆదేశించింది. నిబంధనలు పాటించని విధ్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.