హైదరాబాద్- ప్రతి మతం తోటి వారిని ప్రేమించాలని మాత్రమే చెబుతుందని, ఏ మతం ఇతరులపై దాడి చేయాలని చెప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్సీ అన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై సీఎం ప్రసంగించారు. మతం ఉన్మాద స్థితికి చేరితేనే ప్రమాదమని ఈ సందర్బంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఎదుటి మనిషిని ప్రేమించే తత్వం అలవర్చుకోవాలని చెప్పారు.
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. దసరా, రంజాన్, క్రిస్మస్ ఇలా అన్ని మతాల పండగలకు ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం గుర్తు చేశారు. దేశంలో నెల రోజులు గడువక ముందే ఒక పండగ వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. భారత దేశం భిన్న మతాలు, భిన్న జాతులు ఉన్న బ్యూటిఫుల్ కంట్రీ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఎదుటి మనిషిని ప్రేమించడమే మానవజాతి అభిమతం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మానవ మనుగడ ఎన్నో లక్షల ఏళ్ల కింద ఈ భూగోళం మీద ప్రారంభమైందని, మానవ జీవితం అతి ఉజ్వలంగా ముందుకు సాగడానికి ఏ తరంలో చేపట్టాల్సిన పనులను ఆ తరంలో చేపట్టాలని సీఎం చెప్పారు. శాస్త్రవేత్తలు ఎన్నో అమూల్యమైన విషయాలను ఈ సమాజానికి సమకూర్చారన్న ముఖ్యమంత్రి, ఈ రోజు మనం నివసిస్తున్న నాగరిక సమాజానికి చేరుకోవడానికి ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారని చెప్పుకొచ్చారు.
ఏ మతంలో కూడా తప్పు చేయమని చెప్పలేదని సీఎం అన్నారు. అందరూ శాంతిగా బతకాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ బహుమతులు అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, మత పెద్దలు పాల్గొన్నారు.