కరీంనగర్ జిల్లా చినముల్కనూరు శివారులోని ఓ వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. బావిలో పూర్తిగా కారు మునిగిపోయింది. బావిలో నుంచి కారును తీసేందుకు 9 గంటలుగా చర్యలు సాగించారు అధికారులు. ఉదయం 11 గంటలకు ఓవర్ స్పీడ్తో దూసుకొచ్చి రాంగ్రూట్లో వెళ్లి వ్యవసాయ బావిలో పడింది కారు. హన్మకొండ జిల్లా సూర్యానాయక్ తండా ఎస్ఐ పాపయ్యనాయక్ రెండేళ్ల క్రితం రిటైరై కరీంనగర్లో స్థిరపడ్డారు. ముల్కనూర్ వైపు వెళ్తుండగా ఆయన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బావిలో పడింది. కారుతో పాటే ఆయన జలసమాధి అయ్యారు.
కారును బావిలో నుంచి బయటికి తీసేందుకు సమీపంలోని మానకొండూర్ అగ్నిమాపక శాఖ సహాయాన్ని పోలీసులు కోరారు. ఆ అగ్నిమాపకశాఖ అధికారిగా భూదయ్యనాయక్ విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసుల సమాచారంతో ఆయన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 60 అడుగుల లోతులో ఉన్న కారును బయటికి తీసేందుకు క్రేన్ రప్పించారు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పోలీసులతోపాటు గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 9 గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు కారును రాత్రి 8 గంటల తరువాత వెలికి తీశారు. ఎవరో తెలియని వ్యక్తి కోసం గాలింపు చేపట్టిన ఫైర్ ఆఫీసర్ బూదయ్య వారి కుటుంబ సభ్యులకు వివరాల తెలియజేయాలని ఆధారాల కోసం చూశారు. కానీ కారులో దొరికిన ఆధారాలతోపాటు మృతదేహాన్ని చూసిన వెంటనే అది తన సొంత అన్నదేనని తెలిసి బోరున విలపించారు బూదయ్య.
బావిలో పడిన కారులో అన్న ఉన్నాడనే విషయం తెలియక అధికారిగా తమ్ముడు సహాయక చర్యలు చేపట్టడం కేవలం విధి ఆడిన వింతనాటకంగా అత్యంత ఘోరమైన విషాదంగా అంతా అనుకుంటున్నారు.