నెషనల్ డెస్క్- తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను చంపేస్తామని ఫోన్ కాల్ రావడం కలకలం రేపుతోంది. సీఎం స్టాలిన్ ఇంటిని బాంబుతో పేల్చివేస్తా మంటూ బెదిరింపు రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే బాంబు బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అయితే ఆ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి మతిస్థిమితం లేనివాడని తేల్చారు. చెన్నై లోనిఎగ్మూర్ లో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్కు ఉదయం 10 గంటలకు ఫోన్ చేసిన అపరిచిత వ్యకి ఫోన్ చేశాడు. చెన్నై లోని ఆళ్వార్పేట చిత్తరంజన్ వీధిలోని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెప్పాడు.
మరి కాసేపట్లో ఆ బాంబు పేలనుందని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు. దీంతో పోలీసులు ఉరుకులూ పరుగులు పెట్టారు. ఆ పోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ నిపుణులు, పోలీసు జాగిలంతో సీఎం స్టాలిన్ ఇంటికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఐతే ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించకపోవడంతో అది ఫేక్ కాల్ అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ బాంబు కాల్ వ్యవహారంపై తేనాంపేట పోలీసులు కేసు నమోదుచేసి, సైబర్ క్రైం పోలీసుల సహకారంతో ఆ ఫోన్ ఎక్కడ నుంచి వచ్చిందని విచారణ చేపట్టారు. విల్లుపురం జిల్లా మరక్కాణంకు చెందిన 26 ఏళ్ల భువనేశ్వర్ అనే యువకుడు ఈ ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. అతడికి మతిస్థిమితం లేదని తేల్చారు. భువనేశ్వర్ తల్లిదండ్రులను పిలిపించి, మళ్లీ అతడు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూసుకోవాలని హెచ్చరించి పంపించేశారు. ఐతే భువనేశ్వర్ గతంలో అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, సినీ నటులు రజినీకాంత్, విజయ్, అజిత్ తదితరుల ఇళ్లలో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయినప్పటికీ పోలీసులు లైట్ తీసుకోవడంపై డీఎంకే నేతలు ఫైర్ అవుతున్నారు. ఆ యువకుడిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై సీఎం స్టాలిన్ ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.