హైదరాబాద్- తెలంగాణలో రానున్న మూడు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 15 రోజుల క్రితం వరకు తెలంగాణలో జోరుగా వర్షాలు కురిసినా, ఆ తరువాత వానలు మొహం చాటేశాయి. అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తున్నా, భారీ వర్షాలు మాత్రం కురవడం లేదు. దీంతో రాష్ట్రంలో పొడి వాతావరణంతో పాటు, ఉష్ణోగ్రతలు కొంత మేర పెరిగాయి.
ఇదిగో ఇటువంటి సమయంలో తెలంగాణలో మరోసారి వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వచ్చే మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలతో పాటుగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అందుకే ఈ మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వానలు పడుతాయని ఐఎండీ స్పష్టం చేసింది. పశ్చిమ, నైరుతి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో తెలంగాణలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు.
మరోవైపు తెలంగాణలో గత కొంతకాలంగా నెమ్మదించిన నైరుతి రుతుపవనాలు, ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈనెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు, తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.