ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆచార్య కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా నేపధ్యంలో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.
ప్రస్తుతం పరస్థితులు మామూలు దశకు చేరుకోవడంతో షూటింగ్ను మళ్లీ ప్రారంభించారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన టీజర్, కొన్ని పోస్టర్లు, ఓ పాటను విడుదల చేసి, సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు నటిస్తున్నారు. సోనూసూద్, జిషు షేన్ గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఇక ఆచార్య సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు సినిమా విడుదలవుతుందా అని మెగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో ఆచార్య నుంచి ఓ తీపి కబురు వచ్చింది.
ఆగష్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఆచార్య సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఇఖ మెగా అభిమానులకు పండగే అని వేరే చెప్పక్కర్లేదు.