కర్ణాటకలో కరోనా కలకలం రేపింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే గురుకుల పాఠశాలలో ఏకంగా 94 మంది విద్యార్థులకు పాజిటివ్ గా తేలింది. దీంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. నరసింహరాజపుర తాలూకాకు చెందిన గురుకుల పాఠశాలలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే అక్కడ వచ్చిన పాజిటివ్ కేసులు చూసి అధికారులు కంగు తిన్నారు.
గతవారం ఒక ఉపాధ్యాయుడికి కరోనా సోకడంతో పాఠశాలలోని అందరు విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆదివారం మొత్తం 457 మంది విద్యార్థులు, సిబ్బందికి స్వాబ్ పరీక్షలు నిర్వహించగా.. 59 మంది విద్యార్థులు, 10 సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. సోమవారం మరో 35 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ జరిగింది. పాఠశాలకు సీల్ వేసి శానిటైజేషన్ పనులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టావ్ అంతా వైద్యుల పర్యవేక్షణలో వైద్యం పొందుతున్నట్లు వెల్లడించారు. ఒమిక్రాన్ దృష్ట్యా పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లు అధికారులు తెలిపారు. గురుకుల పాఠశాలలో వెలుగు చూసిన కరోనా కేసులతో చుట్టుపక్కల ప్రజలు అంతా భయాందోళనకు గురయ్యారు. దేశంలో కరోనా మూడో దశ మొదలు కాబోతోందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.