హాలియా- తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 18 వేల 449 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై నోముల భగత్ విజయం సాధించారు. వరుసగా తొలి తొమ్మిది రౌండ్లలో నోముల భగత్ ఆధిక్యం ప్రదర్శించారు. ఐతే ఆ తరువాత 10,11,14 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆధిక్యం కనబరిచారు. మిగితా రౌండ్లలో మాత్రం టీఆర్ఎస్ స్పష్టమైన ఆదిక్యం కనబరిచారు. ఇక కాంగ్రెస్కు 59 వేల 239 ఓట్లు, బీజేపీకి 6 వేల 365 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానంలో నిలువగా, బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాకుండా పోయింది. టీఆర్ ఎస్ గెలుపుతో గులాబీ పార్టీలో సందడి వాతావరణం నెలకొంది.
టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కెసిఆర్ హృదయపూర్వక కృతజ్జతలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సీఎం చెప్పారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం స్పష్టం చేశారు. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల మంజూరు చేసిన లిఫ్టు ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు నీరందిస్తామని సీఎం తెలిపారు. ఎన్నికల సందర్భంలో పార్టీ నాయకులు సేకరించిన ప్రజా సమస్యన్నింటిని కూడా సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరు ఎన్నిరకాల దుష్ప్రచారం చేసినా, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ విశ్వాసాన్ని ప్రస్పుటంగా ప్రకటించిన ప్రజలకు సీఎం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.