కరోనా విజృంభణ కారణంగా తెలుగు చిత్రపరిశ్రమలో మరోసారి పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఎంటర్టైన్మెంట్ విషయానికి సంబంధించి పలు రాష్ట్రాలలో థియేటర్ల మూసివేత జరిగింది. ఇక ఇటీవలే ఏపీలో థియేటర్లు 50% ఆక్యుపెన్సీతో రన్ చేయాలని ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం.
ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున నటించిన బంగార్రాజు చిత్రంపై ధీమాను వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవలే బంగార్రాజు సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఏపీలో టికెట్ రేట్లతో తన సినిమాకి ఎలాంటి సమస్య లేదని అనడం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే లేపింది. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతున్న బంగార్రాజు సినిమా రిస్క్ చేస్తుందని అంటున్నాయి సినీవర్గాలు.గతేడాది ఇదే సమయంలో రవితేజ నటించిన క్రాక్ సినిమా 50% ఆక్యుపెన్సీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి వసూళ్లను రాబట్టింది. మరి ఈసారి బంగార్రాజుతో ఆ సీన్ రిపీట్ అవుతుందా..? అనుకుంటే సంక్రాంతికి దాదాపు 10కి పైగా సినిమాలు రిలీజుకి రెడీగా ఉన్నాయి. ఈ క్రమంలో బంగార్రాజు సినిమా కలెక్షన్స్ పరంగా చిక్కుల్లో పడనుందని సందేహాలు వినిపిస్తున్నాయి. చిన్న సినిమాలను పక్కన పెడితే.. బంగార్రాజుకి పోటీగా దిల్ రాజు ‘రౌడీ బాయ్స్’, మహేష్ మేనల్లుడి ‘హీరో’ సినిమాలు వస్తున్నాయి.
అదీగాక సంక్రాంతి రిలీజ్ అనేది నాగార్జునకి చాలా స్పెషల్. ఎందుకంటే 2016లో సోగ్గాడే చిన్నినాయనా సినిమా కూడా సంక్రాంతి సూపర్ హిట్ గా నిలిచి నాగ్ కి బూస్ట్ ఇచ్చింది. మరి దాని సీక్వెల్ గా వస్తున్న బంగార్రాజు కూడా సంక్రాంతికె సిద్ధమైంది. కాబట్టి నాగ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. మరి బంగార్రాజు సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.