టాలీవుడ్ పీక్ స్టేజీలో ఉంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే అందరూ బాలీవుడ్ అనేవారు.. ఇప్పుడు అదే బాలీవుడ్ రోజురోజుకీ డౌన్ అవుతూ వస్తోంది. గత రెండేళ్లలో స్టార్ హీరోల సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. ఇక తెలుగు చిత్రపరిశ్రమ మాత్రం గ్రాఫ్ పెంచుకుంటూ పోతోంది. ఇదే ఊపు కంటిన్యూ అయితే వచ్చే ఏడాది సరికొత్త రికార్డులు సెట్ చేయడం గ్యారంటీ. సరిగ్గా ఇలాంటి టైంలో కరోనా కొత్త వేరియెంట్ సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కేసులు కూడా మెల్లగా పెరుగుపోతున్నాయి. ఇలాంటి టైంలో స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్స్ తోపాటు ఇండస్ట్రీ మొత్తానికి కొత్త టెన్షన్ పట్టుకుంది.
ఇక విషయానికొస్తే.. 2020లో కరోనా మన జీవితాల్లోకి వచ్చినప్పుడు అన్నింటితోపాటే సినిమా ఇండస్ట్రీ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంది. థియేటర్లని నెలల పాటు మూసేయడంతో పనుల్లేక చాలామంది ఇబ్బందిపడ్డారు. ఇంకా చెప్పాలంటే ఫుడ్ దొరక్క బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇక ఫస్ట్, సెకండ్ లాక్ డౌన్స్ తర్వాత కరోనా మన జీవితాల నుంచి దాదాపుగా వెళ్లిపోయింది. ఇలాంటి టైంలో బీఎఫ్-7 వేరియెంట్ మళ్లీ ఎమర్జ్ కావడం చర్చనీయాశంగా మారింది. అసలే సంక్రాంతికి మూడు వారాలు కూడా లేదు. చాలా ఏళ్ల తర్వాత చిరు-బాలయ్య.. పండగ బరిలో ఉన్నారు. ఇలాంటి టైంలో కరోనా మళ్లీ.. ఆయా నిర్మాతలని తెగ టెన్షన్ పెట్టేస్తోంది.
సినిమా అనేది వ్యాపారం. సినిమా ఎంత బాగున్నా సరే పరిస్థితులు కూడా కలిసొస్తేనే కోట్లకు కోట్లు కలెక్షన్స్ వచ్చిపడతాయి. ఇక సంక్రాంతి బరిలో చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’గా వస్తున్నారు. ఈ రెండు కూడా భారీ బడ్జెట్ తో తీసినవే. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరుగుతుంది. ఇలాంటి టైంలో కరోనా మళ్లీ వచ్చిందనే న్యూస్ అటు ప్రేక్షకులతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ని కాస్త కలవరపెడుతోంది. ఒకవేళ ఈ రెండు మూడు వారాల్లో కరోనా కేసులు పెరిగితే, థియేటర్ కు వచ్చే ప్రేక్షకులు సంఖ్య తగ్గిపోతుందని భయపడుతున్నారు. అదే జరిగితే మాత్రం కలెక్షన్స్ లో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుందని ఆందోళన పడుతున్నారు.
ఒకవేళ కరోనా కేసులు మళ్లీ పెరిగితే.. సంక్రాంతి సినిమాలపైనే కాదు మొత్తం ఇండస్ట్రీపై పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం పుష్ప 2, రామ్ చరణ్-శంకర్ ప్రాజెక్టు, మహేశ్-త్రివిక్రమ్ సినిమా, ప్రభాస్ ‘సలార్’తోపాటు మారుతితో చేస్తున్న సినిమా కూడా సెట్స్ పై ఉన్నాయి. వీటితోపాటు ఎన్టీఆర్-కొరటాల శివ ప్రాజెక్టు కూడా జనవరిలోనే ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇప్పుడు కేసులు పెరిగితే ఈ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ అనుకున్నదానికంటే లేటవుతాయి. నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. రిలీజై డేట్ కూడా మారిపోతుంది. ఇక 2022లోనూ నిఖిల్ తప్పితే టైర్-2 హీరోలెవరూ కూడా పెద్ద హిట్స్ కొట్టలేకపోయారు. వాళ్లంతా కూడా 2023పైనే గట్టిగా ఆశలు పెట్టేసుకున్నారు. ఇప్పుడు కరోనా మళ్లీ కొత్త వేరియెంట్స్ తో ఇబ్బందిపెడితే.. ఈ హీరోల కొత్త సినిమాలు మరింత ఆలస్యమవుతాయి. ఇలా ఎటువైపు నుంచి చూసినా సరే నిర్మాతలకు మాత్రం చుక్కలు కనిపించడం గ్యారంటీ అనిపిస్తుంది. మళ్లీ కొవిడ్ కేసులు పెరిగితే ఇండస్ట్రీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందని మీరనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.