తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు.. సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్తో సోమవారం ఆస్పత్రిలో చేరిన ఆయన మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. కృష్ణ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతాపం తెలిపారు. అలాగే ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ భావోధ్వేగానికి గురయ్యారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న కృష్ణ మృతికి పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. కృష్ణ గారి ఇంటికి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కృష్ణ గారి పార్థివ దేహాన్ని సందర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కృష్ణ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. కాసేపటి క్రితం ఆయన కృష్ణ నివాసానికి వెళ్లారు. కృష్ణ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. మహేశ్ బాబును కేసీఆర్ హత్తుకుని ఓదార్చారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ తదితర నేతలు ఉన్నారు. మరోవైపు, కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మహేష్ బాబును ఓదారుస్తూ ఆయన పక్కనే కొద్ది సమయం పాటు కూర్చున్నారు. కృష్ణ గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. “తెలుగు చలన చిత్ర రంగంలో దిగ్గజ నటుడు కృష్ణ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం. వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయాను. కృష్ణ ఆతిధ్యమిస్తే చాలా సార్లు ఆయన ఇంటికి వచ్చాను. ఆయన ముక్కు సూటిగా మాట్లాడే మనిషి. పార్లమెంట్ సభ్యుడిగా దేశానికి సేవలందించారు. అల్లూరి సీతారామరాజు లాంటి దేశభక్తి సినిమాను తీశారు. ఆ సినిమాను ఎన్నో సార్లు చూశాను. ప్రజలకు దేశాన్నికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించాం. ఆయన కుటుంబ సభ్యులు ఈ దుఃఖాన్ని భరించే ధైర్యాన్ని ప్రసాధించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను” అని తెలిపారు. ఇప్పటికే దర్శకుడు రాఘవేంద్ర రావు, హీరో పవన్ కల్యాణ్, వెంకయ్యనాయుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు కృష్ణ గారి భౌతిక కాయాన్ని సందర్శించారు. మెగాస్టార్ చిరంజీవి … కృష్ణ గారి పార్థివ దేహాన్ని సందర్శించారు. అనంతరం మహేష్ బాబును ఓదారుస్తూ ఆయన పక్కనే కొద్ది సమయం పాటు కూర్చున్నారు. కృష్ణ గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. .