తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తికి తెలుగు నాట ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. రియల్ లైఫ్లో బ్రదర్స్ అయిన వీరిద్దరి సినిమాలు చూసేందుకు తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే వీళ్ల సినిమాలు తెలుగు, తమిళంలో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలవుతాయి. కరోనా ముందు వరకు సరైన హిట్స్ లేక ఇబ్బంది పడిన ఈ స్టార్ బ్రదర్స్.. ఆ తర్వాత నుంచి మాత్రం సూపర్ హిట్స్ తో రచ్చ చేస్తున్నారు. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో ఓటీటీ ఆడియెన్స్ను అలరించిన సూర్య.. ఈ మూవీలో నటనకు గానూ జాతీయ పురస్కారాన్ని కూడా దక్కించుకున్నాడు. ఇక గతేడాది రిలీజైన కమల్ హాసన్ మూవీ ‘విక్రమ్’లో రోలెక్స్ పాత్రలో తనదైన మార్క్ నటనతో థియేటర్లను షేక్ చేశాడు. ‘విక్రమ్’ క్లైమాక్స్కు సూర్య పాత్రే ప్రాణం పోసిందని ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకులు కూడా మెచ్చుకున్నారు.
కార్తి కూడా వరుస హిట్లు కొట్టి దూసుకెళ్తున్నాడు. ‘ఖైదీ’, ‘విరుమన్‘, ‘పొన్నియిన్ సెల్వన్’, ‘సర్దార్’ చిత్రాలతో బ్యాట్ టు బ్యాక్ బ్లాక్బస్టర్లు అందుకున్నాడు. ‘ఖైదీ’కి సీక్వెల్ తెరకెక్కిస్తే అందులో సూర్య, కార్తి కలసి సందడి చేసే చాన్స్ ఉంది. ఈ విషయాన్ని అటుంచితే.. సూర్య, కార్తి కలసి ఓ టాక్ షోలో పాల్గొనబోతున్నారట. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్స్టాపబుల్’ తర్వాతి ఎపిసోడ్లో ఈ స్టార్ బ్రదర్స్ పాల్గొననున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్ను త్వరలో షూట్ చేయనున్నారని.. ‘ఆహా’లో ఇది స్ట్రీమింగ్ అయిన తర్వాతే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందని కొందరు నెటిజన్స్ పోస్టులు పెట్టారు. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి, సూర్య-కార్తి కలసి ‘అన్స్టాపబుల్’ షోలో పాల్గొంటే చూడాలని ఉందా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.