నందమూరి నటసింహం బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొన్న జరిగిన ‘‘వీర సింహారెడ్డి’’ సక్సెస్ మీట్లో బాలయ్య బాబు మాట్లాడుతూ.. ‘‘ అక్కినేని, తొక్కినేని’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రెండు కుటుంబాల మధ్య మళ్లీ గ్యాప్ వచ్చిందా? అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలుగా పేరున్న నందమూరి, అక్కినేని ఫ్యామిలీల మధ్య మొదటినుంచి ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు అన్న, తమ్ముడు అని పిలుచుకునేవారు. టాలీవుడ్లో ఈ ఇద్దరూ మల్టీస్టారర్ సినిమాలకు దిశా నిర్ధేశం చేశారు. ఇద్దరి మధ్యా సినిమా పరంగా ఎంత పోటీ ఉన్నా కూడా పదుల సంఖ్యలో మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఇద్దరి మధ్యా చక్కటి అనుబంధం ఉంది.
అయితే, ఒకానొక టైంలో ఏదో విషయంలో ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ చాలా ఏళ్లు కొనసాగింది. ఎన్టీఆర్తో వచ్చిన గ్యాప్ గురించి ఏఎన్ఆర్ స్వయంగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి మాట్లాడుతూ.. ‘‘ మేమిద్దరం సత్యం శివం సినిమాలో పనిచేస్తున్నాము. మబ్బుల కారణంగా షూటింగ్కు బ్రేక్ వచ్చింది. నేను, అల్లురామలింగయ్య, రావుగోపాల్రావు, ఎన్టీఆర్ కూర్చుని ఉన్నాం. ఆయన పేపర్ చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ‘‘ బ్రదర్.. మనమిద్దరం రాజకీయాల్లోకి వెళదాం’’ అని అన్నారు. అప్పుడు నేను.. సినిమాల్లో ఉంటే ఎవ్వరికీ విరోధం కాము.. రాజకీయాల్లో అయితే, ఓ సెక్షన్కు విరోధం అవుతాం.
నేను పాలిటిక్స్కు పనికి వస్తాను కానీ, నువ్వు పనికి రావు అని అన్నాను. నువ్వు ఆవేశ పరుడివి.. ఎట్టపడితే అట్ల మాట్లాడతావు.. నేను ఎంత చెప్పినా వినలేదు.. ఆ, ఊ అంటావు. వద్దు అన్నాను నేను. ఓ సారి మా కుటుంబాన్ని భోజనానికి ఇంటికి పిలిచాడు. అప్పుడు నాతో మరోసారి రాజకీయాల గురించి అడిగాడు. ఏదో ఒకటి డిసైడ్ కమ్మన్నాడు. నువ్వు కావాలంటే వెళ్లు.. నా ఆరోగ్యం బాగోలేదు అన్నాను. డబ్బులేదు. ఉన్న డబ్బు స్టూడియోకు పెట్టాను అని చెప్పా. తర్వాత ఓ సినిమా షూటింగ్లో కూడా మరోసారి అడిగాడు. అప్పుడు కూడా నేను రాను అని చెప్పా. తర్వాత ఓ శ్లోకం విషయంలో మా మధ్య కొంత మంది మంట పెట్టారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. అన్నపూర్ణ స్టూడియో విషయంలోనూ మా మధ్య గ్యాప్ వచ్చింది.
అప్పటినుంచి ఆయనతో మాట్లాడటం మానేశాను. అవాయిడ్ చేసేవాడ్ని. ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా నేను పట్టించుకునేవాడిని కాదు. లక్ష్మీ పార్వతితో పెళ్లి తర్వాత సినిమా వాళ్ల అందరితో పాటు నన్ను కూడా భోజనానికి పిలిచారు. అప్పుడు ఇద్దరం కలిసిపోయాం. తర్వాత ఎన్టీఆర్ దంపతులను నేను భోజనానికి పిలిచాను. స్టూడియో కాంట్రవర్సీలో నేను గెలిచాను. కోర్టుకు వెళ్లి విజయం సాధించాను’’ అని చెప్పారు. ఇలా రెండు కుటుంబాలు మళ్లీ కలిసిపోయాయి. అయితే, గత కొన్నేళ్ల నుంచి మళ్లీ రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చినట్లుగా తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా నాగార్జున, బాలకృష్ణ కూడా ఏ వేదికపై కలిసి కనిపించిన దాఖలాలు కూడా లేవు. ఇలాంటి నేపథ్యంలో బాలయ్య అక్కినేని, తొక్కినేని అన్న వ్యాఖ్యలు చేయటం మరో సారి చర్చకు దారి తీసింది. మరి, బాలకృష్ణ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.