సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ముగిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో మహేష్ చేతుల మీదుగా తుది కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో పాటు, సినీ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. ఇక, కృష్ణ మరణంతో మహేష్ బాబు తీవ్రంగా కృంగిపోయారు. గత రెండు రోజులుగా తండ్రిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సూపర్ కృష్ణ పేరిట ఓ మెమోరియల్ను ఏర్పాటు చేయనున్నారు. అతి త్వరలో హైదరాబాద్లో ఈ మెమోరియల్ ఏర్పాటు కానుంది.
ఆ మెమోరియల్లో కృష్ణకు సంబంధించిన అరుదైన వస్తువులు ఉంచనున్నారు. కృష్ణ సినిమాలకు వచ్చిన షీల్డులు, అవార్డులు.. ఆయన నటించిన 365 చిత్రాల తాలూకా లైఫ్ సైజ్ ఫొటోలు పెట్టనున్నారు. వీటితో పాటు కృష్ణ భారీ విగ్రహం ఒకటి మెమోరియల్లో ఏర్పాటు చేయనున్నారు. కాగా, గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ సోమవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కృష్ణ మరణించారు. దీంతో ఆయన్ని ఇంటికి తీసుకువచ్చారు.
ఇంటి దగ్గర ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. తర్వాత కృష్ణ పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోకు తీసుకువచ్చారు. అక్కడ అభిమానుల సందర్శన కోసం ఉంచారు. సాయంత్రం సమయంలో అంత్యక్రియల కోసం మహా ప్రస్థానానికి తరలించారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఇక, మహేష్ కుటుంబంలో వరుసగా ఇది మూడో విషాదం. మొదట ఆయన సోదరుడు రమేష్ బాబు మరణించారు. ఆ తర్వాత తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28న అనారోగ్యంతో మరణించింది. సరిగ్గా రెండు నెలల కూడా గడవక ముందే కృష్ణ కన్నుమూశారు.