గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల కన్నా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో చెలరేగుతున్న రాజకీయాలే చాలా రంజుగా ఉన్నాయంటున్నారు ప్రజలు. ఇటీవల ‘మా’ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తెర పైకి ఎన్నో కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సారి మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ల మద్య ఉత్కంఠ పోరు సాగనుంది.
వాస్తవానికి అధ్యక్ష పదవికి విష్ణు,ప్రకాశ్ రాజ్,జీవిత,హేమ, జీవీఎల్ నరసింహారావు ‘మా’అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కానీ.. జీవిత, హేమ పోటీ నుంచి తప్పుకొని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో చేరిపోయారు. రెండు నెలలుగా మా సభ్యుల మధ్య వాదోపవాదాలు, వాడివేడి ఆరోపణలు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తెరపై కొత్త వివాదం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా అధ్యక్ష బరిలో దిగిన ప్రకాష్ రాజ్ కి సప్పోర్ట్ గా ఉన్న నాగబాబు సోషల్ మీడియా వేదికగా అధ్యక్షుడు నరేష్, మోహన్ బాబులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాగా, సినీనటుడు మోహన్ బాబు మా బిల్డింగ్ గురించి పలు ఆరోపణలు చేశారు.
గతంలో ‘మా’ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎక్కువ ధరకు ఆ భవనాన్ని కొనుగోలు చేసి అతి తక్కువ ధరకు అమ్మేశారని ఆయన విమర్శించారు. దీనిపై నాగబాబు గట్టిగానే స్పందించారు.. భవనాన్ని కొనుగోలు చేసిన సమయంలో తానే అధ్యక్షుడిగా ఉన్నానని చెప్పారు. 2006-2008 మధ్య తాను అధ్యక్షుడిగా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో రూ.71.73 లక్షలతో భవనాన్ని కొనుగోలు చేశామని వివరించారు. ఇక ఇంటీరియర్ డిజైనింగ్ కోసం రూ.3 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు.
తాను 2008లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన అనంతరం మా వ్యవహారాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేదని చెప్పారు. 2017లో అధ్యక్షుడుగా ఉన్న శివాజీ రాజా, సెక్రెటరీగా ఉన్న నరేష్ 90లక్షల విలువ చేసే మా బిల్డింగ్ కేవలం 30లక్షలకు విక్రయించారని నాగబాబు ఆరోపిస్తున్నారు. ఈ విషయం గురించి నరేశ్నే అడగాలని మోహన్ బాబుకు సూచించారు. తాను కూడా అదే విషయంపై నరేశ్ని ప్రశ్నిస్తానని చెప్పారు. అంతేగానీ, భవనం అమ్మకం గురించి తనపై వ్యాఖ్యలు చేస్తే మాత్రం తీవ్రంగా స్పందిస్తానని నాగబాబు హెచ్చరించారు. మరి దీనిపై ముందు ముందు ఎలాంటి వివాదాలు చెలరేగుతాయో చూడాలి మరి.