కొన్ని నెలల క్రితం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మీద హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది. ఇక తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ను చంపుతామంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. ఆ వివరాలు..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించి సందడి చేశాడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ సినిమాతో మాస్ ఆడియన్స్ను అలరించడానికి రెడీ అవుతున్నాడు సల్మాన్. షారుక్ ఖాన్ పఠాన్ భారీ విజయం బాలీవుడ్కు కాస్త ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు. స్టార్ హీరోలు వరుస సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అటు అభిమానులు కూడా సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా మీద బుట్ట బొమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక సినిమాల సంగతి కాసేపు పక్కకు పెడితే సల్మాన్ ఖాన్ మీద వచ్చే వివాదాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని అంశాలకు సంబంధించి ఆయన మీద కేసులు కూడా నమోదు అయ్యాయి.
సల్మాన్ ఖాన్ జీవితంలోనే అతి పెద్ద మచ్చగా మిగిలిపోయింది కృష్ణజింకల కేసు. ఈ కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్ ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిగాడు. ఇక తాజాగా ఈ కేసు విషయంలో సల్మాన్ ఖాన్కు ఊరట లభించింది. కోర్టు నుంచి అయితే సమస్య లేదు కానీ.. మరో రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాడు సల్మాన్. కృష్ణ జింకలను వేటాడిన కేసులో.. బిష్ణోయ్ తెగ వారు.. సల్మాన్ మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కారణం కృష్ణ జింకలు బిష్ణోయ్ తెగవారికి ఆరాధ్య దైవం. దాంతో ఈ తెగ వారు సల్మాన్ మీద పట్టరాని కోపంగా ఉన్నారు. అంతేకాక ఈ తెగకు సంబంధించిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. కొన్ని నెలల క్రితం సల్మాన్ మీద హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో లారెన్స్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జైలుకు వెళ్లినా సరే.. సల్మాన్ మీద అతడి కోపం మాత్రం తగ్గ లేదు.
పైగా లైవ్లో సల్మాన్ ఖాన్కు వార్నింగ్ ఇచ్చాడు లారెన్స్. ఈ మధ్య లారెన్స్ బిష్ణోయ్ ఓ టీవీ చానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ జరుగుతుండగానే.. లైవ్లోనే సల్మాన్ ఖాన్ను చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు లారెన్స్ బిష్ణోయ్. సల్మాన్ మీద తమ తెగ వారంతా చాలా కోపంతో ఉన్నారని తెలిపాడు. సల్మాన్ ఖాన్ తమ తెగ వారిని, తమ ఆరాధ్య దైవాన్ని అవమానించాడని.. అందుకే వారంతా అతనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపాడు లారెన్స్ బిష్ణోయ్. అంతే కాదు సల్మాన్ను జోధ్పూర్లోనే చంపుతానని లైవ్లోనే వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక సల్మాన్ను వదిలిపెట్టాలి అంటే.. అతను తమ కులదైవం ఆలయాన్ని దర్శించుకుని.. తమ తెగ వారికి బహిరంగ క్షమాపణ చెబితే అప్పుడు అతడిని వదిలేస్తామని లారెన్స్ బిష్ణోయ్ స్పష్టం చేశాడు.
ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక గ్యాంగ్ స్టార్ అయిన లారెన్స్ గతేడాది మేలో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను హత్య చేశాడు. ఈ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది తమ పనేనంటూ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో లారెన్స్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. సల్మాన్ను చంపేస్తాం అని బెదిరించడంతో.. ప్రభుత్వం సల్మాన్కు భద్రత పెంచింది. మరి బిష్ణోయ్ వ్యాఖ్యలపై సల్మాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.